ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చీ గురువారం నాడు భారత్‌కు వచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 20వ ఇండియా-ఇరాన్ జాయింట్ కమిషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి ఆయన అధ్యక్షత వహించారు.  

ఈ ఏడాది ఇండియా-ఇరాన్ మిత్రత్వ ఒప్పందానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అరగ్చీ పర్యటన ప్రత్యేకంగా నిలిచింది. ఈ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అరగ్చీకి స్వాగతం పలుకుతూ, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా అభివర్ణించింది.

“ఇండియా-ఇరాన్ జాయింట్ కమిషన్ సమావేశానికి అరగ్చీ వచ్చారు. ఇది ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి, అభివృద్ధి చేసుకునే మంచి అవకాశం,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ‌ ఎక్స్ (X) లో పోస్ట్ చేసింది. 

హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, ఎనర్జీ, కనెక్టివిటీ, ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. అరగ్చీ 2024 ఆగస్టులో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే ఆయన తొలి అధికారిక భారత పర్యటన. ఈ సమావేశం అనంతరం అరగ్చీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు.

 

Scroll to load tweet…

జాయింట్ కమిషన్ సాధారణంగా ప్రతి సంవత్సరం సమావేశమవుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి, ఇతర అంతర్గత సమస్యల కారణంగా విరామం వచ్చింది. ఈ 20వ సమావేశంలో ఇరుదేశాల మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందాల పురోగతిని సమీక్షించడమే కాక, భవిష్యత్‌లో వ్యూహాత్మక సహకారాన్ని మెరుగుపరచే మార్గాలను పరిశీలించారు.

ఇరాన్ ఎంబసీ కూడా భారత విదేశాంగ మంత్రిత్వశాఖతో ఏకాభిప్రాయంతో, “ఇరాన్-ఇండియా మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందాల అమలుపై సమీక్ష జరగనుంది” అని తెలిపింది. ఆప‌రేష‌న్ సింధూర్ నేప‌థ్యంలో అర‌గ్చీ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ ఉద్రిక్తతలపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఎస్మాయిల్ బాఘాయీ గంభీర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, పాకిస్థాన్ సంయమనం పాటించాల‌ని కోరారు. 

 

Scroll to load tweet…

అరగ్చీ ఇప్పటికే  ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, భారత ప్రభుత్వానికి సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. 
“పాహల్గామ్ ఉగ్రదాడిని ఇరాన్ ఖండిస్తోంది. మృతుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం,” అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. భారత్‌కు రాకముందు, అరగ్చీ పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్‌తో సమావేశం కావడం గమనార్హం.