సారాంశం

పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలో దేశప్రజలను అలర్ట్ చేసేందుకు దేశంలోని వివిధ నగరాలలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. 

భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించే సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. యుద్ద సమయంలో ప్రజలు ఎలా వ్యవహరించాలి?  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది ఈ మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం నగరాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.  సికింద్రాబాద్, గోల్కొండ,  కంచన్ బాగ్, మౌలాలి ప్రాంతాల్లో పోలీసులతో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలోబ ఈ మాక్ డ్రిల్ జరుగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇలాగే మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎస్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 ఇక ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో ఒక సమగ్ర మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రతీష్ కుమార్ మాట్లాడుతూ, "భవనం కూలిపోయినప్పుడు సెర్చ్ అండ్ రెస్క్యూ పరిస్థితుల్లో, మేము మెడికల్ ఫస్ట్ రెస్పాండర్లను అందిస్తాము. మా బృందంలో సమర్థవంతమైన మెడికల్ ఫస్ట్ రెస్పాండర్స్ (MFR) ఉన్నారు. పరిస్థితిని బట్టి బాధితులకు సహాయం చేస్తాము." అని అన్నారు.

ఇక మహారాష్ట్రలోనే 10,000 మందికి పైగా వాలంటీర్లు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. ముంబై, పూణే వంటి నగరాల్లో కీలక కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని 60 ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగించారు. ఐదు నిమిషాల పాటు బ్లాక్‌అవుట్ నిర్వహించారు. పూణేలోని కౌన్సిల్ హాల్‌లో పూర్తి స్థాయి సిమ్యులేషన్ జరిగింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (టెర్మినల్ 3), కేరళలోని ఎర్నాకులం సివిల్ స్టేషన్‌లలో కూడా హై-అలర్ట్ సంసిద్ధతా డ్రిల్స్ నిర్వహించారు.

హర్యానాలో "ఆపరేషన్ అభ్యాస్" పేరుతో రాష్ట్రవ్యాప్త డ్రిల్ నిర్వహించారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో సాయంత్రం 7:50 నుంచి 8:00 గంటల వరకు బ్లాక్‌అవుట్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. పౌరులు లైట్లు ఆపివేసి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భౌతిక సంసిద్ధతను పరీక్షించడంతో పాటు, ప్రథమ చికిత్స శిక్షణ, షెల్టర్ ప్లానింగ్, రియల్ టైమ్ కమ్యూనికేషన్ తనిఖీలపై దృష్టి సారించారు. భవిష్యత్తు ముప్పులను నివారించడానికి ప్రజా భద్రత, సమన్వయ ప్రతిస్పందన విధానాలను మెరుగుపరుస్తున్న సమయంలో ఈ డ్రిల్స్ దేశవ్యాప్తంగా ఏకీకృత ఫ్రేమ్‌వర్క్ కింద నిర్వహించబడ్డాయి.