ఈసీని రాజకీయ రంగంలోకి లాగకూడదు - మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురైషీ
ఎన్నికల కమిషన్ ను రాజకీయాల్లోకి లాగకూడదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురైషీ అన్నారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయకపోతే చర్యలు తీసుకునే అధికారం ఈసీకి లేదని అన్నారు. వీటికి సంబంధించిన చర్చలు పార్లమెంట్, అసెంబ్లీలలో జరగాలని ఆయన అన్నారు.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నదే ఈసీ రాజ్యాంగ ఆదేశమని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురైషీ అన్నారు. ఈసీని రాజకీయ రంగంలోకి లాగకూడదని తెలిపారు. మేనిఫెస్టోల్లో ఎన్నికల వాగ్దానాల ఆర్థిక సాధ్యతను సవివరంగా సమాచారం ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాజకీయ పార్టీలకు లేఖ రాసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ పార్టీలు చేసిన ఎన్నికల ప్రతిజ్ఞల ఆదాయ మార్గాలు, పరిధి, కవరేజీ విస్తీర్ణం, ఆర్థికపరమైన చిక్కుల వివరాలను కోరుతూ ఒక ప్రొఫార్మాను జోడించడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని సవరించాలని ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో సమాచారాన్ని అక్టోబర్ 19లోగా సమర్పించాలని పోల్ ప్యానెల్ కోరింది.
పాకిస్థాన్ బోటులో వందల కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్
ఈ నేపథ్యంలో ఓ వార్తాపత్రికతో శుక్రవారం మాట్లాడిన ఖురేషి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉన్న మార్గదర్శకాలు అర్థం లేనివని, వాటిని ఉల్లంఘించిన వారికి జరిమానా విధించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటేనే వాటికి అర్థం ఉంటుందని అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను తొలగించే అధికారం ఈసీకి ఇవ్వాలని ఆయన వాదించారు. దీనిని ఎన్నికల కమిషన్ యూటర్న్ అని పిలవడం తప్పని, సుప్రీంకోర్టు సూచనల మేరకే ఈసీ ఇలా రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు.
‘‘ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈసీ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అవి ఈసీ ఆదేశాలు కావు. రాజకీయ పార్టీలు చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని శిక్షించే అధికారం దానికి లేదు. వాటి నమోదును తొలగించే అధికారం కూడా లేదు. పార్టీలు తమ మేనిఫెస్టోలకు కట్టుబడి ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడానికి ఈసీ జడ్జ్ చేస్తూ కూర్చోదు ’’ అని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014లో రాజకీయ పార్టీలకు ఈసీ మార్గదర్శకాలను రూపొందించినప్పటికీ, అది ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందని ఖురేషీ అన్నారు. 2013లో ఎస్ సుబ్రమణ్యం బాలాజీ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ కేసు ప్రస్తావించిందని అన్నారు. అప్పట్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయని ఆయన చెప్పారు.
‘‘ కొత్త ప్రతిపాదన 2014 లో జారీ చేసిన ప్రతిపాదనలు కొత్తవేం కాదు. పాత వాటి వివరణ మాత్రమే. 2013 లో కోర్టు తీర్పుపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించిన తరువాత ఈసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 2014 జనవరిలో డీఎంకే, ఏఐఏడీఎంకే రెండింటికీ ఈసీ నోటీసులు ఇచ్చింది. కానీ దాని నుంచి ఏమీ బయటకు రాలేదు’’ అని ఆయన అన్నారు.
అయితే ఎన్నికల వాగ్దానాల ఖర్చు, పార్టీలు మ్యానిఫెస్టోల్లోని హామీలను నెరవేర్చాయా లేదా అనే చర్చకు అసలు వేదిక పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు కావాలని ఖురైషీ అభిప్రాయపడ్డారు. ఈసీని రాజకీయ రంగంలోకి లాగవద్దని ఆయన అభ్యర్థించారు. “అన్ని పార్టీలు మేనిఫెస్టోలను నెరవేర్చాయో లేదో ఎవరూ చెప్పలేరు. వీటికి చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ లో ఆర్థికవేత్తలు, నిపుణులు లేరు. మేనిఫెస్టో హామీలు నెరవేర్చారా లేదా అనే చర్చ పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో జరగాలి’’ అని అన్నారు.