Asianet News TeluguAsianet News Telugu

చైనాతో పోరాడిన సమర యోధుడిని రెజాంగ్ లాకు వీల్ చైర్‌లో తీసుకెళ్లిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వీడియో

1962లో భారత్ చైనా యుద్ధం జరిగిన తూర్పు లడాఖ్‌లోని రెజాంగ్‌లో పునర్నిర్మించిన యుద్ధ స్మారకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. గురువారం ఆయన ఈ స్మారకాన్ని ప్రారంభించడానికి వెళ్తూ ఆ యుద్ధంలో పోరాడిన రిటైర్డ్ బ్రిగేడియర్ ఆర్‌వీ జాతర్‌ను వీల్ చైర్‌పై కూర్చోబెట్టుకుని స్వయంగా కేంద్ర మంత్రే తోసుకుంటూ వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
 

defence minister rajnath singh inaugurates revamped rezang la memorial
Author
Ladakh, First Published Nov 18, 2021, 7:21 PM IST

న్యూఢిల్లీ: Ladakhలో తూర్పు పర్వత ప్రాంతంలోని Rezang La ఏరియాలో పునర్నిర్మించిన యుద్ధ స్మారకాన్ని(War Memorial) కేంద్ర రక్షణ మంత్రి Rajnath Singh గురువారం ప్రారంభించారు. ఈ అద్భుతమైన ప్రాంతానికి రెజాంగ్ లా పోరాట యోధుడు.. రిటైర్డ్ బ్రిగేడియర్ ఆర్‌వీ జాతర్‌ను Wheel Chairలో కూర్చోబెట్టుకుని స్వయంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసుకుంటూ తీసుకెళ్లాడు. కేంద్ర రక్షణ మంత్రి పీఆర్వో ఒకరు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమర యోధుడు ఆర్‌వీ జాతర్‌ను తోసుకెళ్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

1962లో సినో -ఇండియా యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రిటైర్డ్ బ్రిగేడియర్ ఆర్‌వీ జాతర్‌ను స్వయంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీల్ చైర్‌లో తోసుకుంటూ తీసుకెళ్లారని ట్వీట్ ఆయన చేశారు. 1962 ఇండియా చైనా యుద్ధ సమయంలో మేజర్ బ్రిగేడియర్ జాతర్.. 13 కుమావో బ్రేవో, డెల్టా కంపెనీలకు సారథ్యం వహించారు. రెజాంగ్‌ లా యుద్ధంలో మగ్గర్ హిల్ దగ్గర ఈయన కంపెనీలకు దిశా నిర్దేశం చేశారు.

Also Read: భారత్‌లో మరో చైనా గ్రామం?.. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 నివాసాలు!.. శాటిలైట్ చిత్రాల వివరాలివే

దుర్బేధ్యంగా ఉండే రెజాంగ్ లా ప్రాంతంలో పునర్నిర్మించిన యుద్ధ స్మారకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనంతరం ప్రారంభించారు. ఈ స్మారకాన్ని దేశానికి అంకితం చేశారు. భారత ఆర్మీ ప్రదర్శించిన అచంచల సాహసానికి ఈ స్మారకం ప్రతీక అని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ఘట్టం భారత చరిత్రలో శాశ్వతమై ఉండటమే కాదు.. ఎప్పటికీ మన గుండెలో కొట్టుకుంటూనే ఉంటుందని వివరించారు.

18వేల అడుగుల ఎత్తులో చరిత్రాత్మక రెజాంగ్ లా యుద్ధం జరిగిందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇంత ఎత్తులో పోరాటాన్ని ఈ రోజుల్లోనూ ఊహించుకోవడం సాహసంగానే అనిపిస్తున్నదని తెలిపారు. మేజర్ షైతాన్ సింగ్, ఆయన సహ జవాన్లు చివరి బుల్లెట్ వరకు చివరి శ్వాస వరకు రాజీ లేకుండా పోరాడారు అని వివరించారు. భారత చరిత్ర పుటలో త్యాగానికి, ధైర్యానికి సరికొత్త అధ్యాయం వారు లిఖించారని తెలిపారు.

రెజాంగ్ లా ప్రాణ త్యాగం చేసిన భారత జవాన్లకు ఆయన నివాళులు అర్పించినట్టు అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతి క్లిష్టమైన, గొప్ప యుద్ధాల్లో ఒకటిగా రెజాంగ్ లా యుద్ధానికి పేరు ఉన్నదని వివరించారు.

Also Read: పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్

ఒకవైపు చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో కేంద్ర రక్షణ మంత్రి ఈ స్మారకాన్ని ప్రారంభించడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్‌తో ఉన్న సరిహద్దు సమీపంలో చైనా నిర్మాణాలు చేపడుతూ పొగ పెడుతున్నది. గతేడాది లడాక్‌లోని గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఉద్రిక్తతలకు సంబంధించి ఇప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

చైనాతో 1962లో జరిగిన ఈ యుద్ధంలో భారత ఆర్మీకి మేజర్ షైతాన్ సింగ్ నాయకత్వం వహించారు. ఈ యుద్ధంలో ఆయన వెనుకడుగు వేయకుండా ధీటుగా పోరాడారు. చివరి వరకు పోరాడుతూ యుద్ధంలోనే కన్నుమూశాడు. అందకే మరణానంతరం ఆయన పరాక్రమానికి గాను ప్రభుత్వం పరమ వీర చక్ర అవార్డును ప్రకటించింది. ఈ యుద్ధంలో సుమారు 120 మంది భారత సైనికులు దాదాపు వేయికి పైగా చైనా జవాన్లతో తలపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios