Congress: అసెంబ్లీ నియోజకవర్గానికి టికెట్ ఇప్తిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ డబ్బులు వసూలు చేసిందని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. స్వయాన ఆ పార్టీ నాయకుడు ఈ ఆరోపణలు చేయడంతో ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

హర్యానా బావల్ టికెట్ వ్యవహారం

హర్యానాలోని బావల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారంటూ గౌరవ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ గౌరవ్ హర్యానా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భర్త కావడం గమనార్హం. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గౌరవ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం కాంగ్రెస్ టికెట్ హామీ ఇస్తూ మొత్తం రూ. 7 కోట్లు తీసుకున్నారని అన్నారు. ఇందులో రూ. 1.6 కోట్లు కొడికున్నిల్ సురేశ్కి ఇచ్చినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ కే.సీ వేణు గోపాల్ వ్యక్తిగత సహాయకుడు అనాస్‌కు కూడా డబ్బు చెల్లించినట్టు తెలిపారు. ఈ చెల్లింపులు వారి పార్లమెంటరీ జీత ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం గడిచినా డబ్బు తిరిగి ఇవ్వలేదని గౌరవ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రియాంకా గాంధీ పీఏ పేరు ప్రస్తావన

ప్రియాంకా గాంధీ పీఏ సదాప్ ఖాన్‌కు రూ. 35 లక్షలు ఇచ్చినట్టు గౌరవ్ కుమార్ ఆరోపించారు. డబ్బు తిరిగి అడిగినప్పుడు ప్రియాంకా గాంధీ అసభ్యంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. 10 జనపథ్ వద్ద ప్రియాంకా గాంధీ పీఏకు, అలాగే సోనియా గాంధీ పీఏ మహేష్‌కు కూడా నగదు అందజేసినట్టు చెప్పారు. విడతలుగా, అదనపు ఖర్చులతో కలిపి మొత్తం చెల్లింపు రూ. 7 కోట్లకు చేరిందని వివరించారు.

గౌరవ్ కుమార్ ప్రకారం, దక్షిణ భారత కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కూడా భారీ మొత్తాలు వసూలు చేసినట్టు తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు, రూ. 50 కోట్లు వంటి పెద్ద మొత్తాలు తీసుకున్నట్టు తనకు చెప్పారని ఆరోపించారు. కేసీ వేణుగోపాల్ కార్యాలయం ఈ అంశాన్ని చర్చిస్తామని, తనకు ఒక పదవి ఇస్తామని సూచించిందని అన్నారు. అయితే తనకు పదవి అవసరం లేదని, డబ్బు మాత్రమే తిరిగి కావాలని తాను చెప్పినట్టు వెల్లడించారు.

Scroll to load tweet…

స్పందించిన బీజేపీ

ఈ ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రతినిధి ప్ర‌దీప్ భండారీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

హర్యానాలోని కాంగ్రెస్ నాయకురాలే ఈ విషయాన్ని బయటపెట్టారని అన్నారు. వాట్సాప్ చాట్స్‌లో ప్రియాంకా వాద్రా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. కేసీ వేణుగోపాల్‌ను ముందుంచి రూ. 7 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గాంధీ వాద్రా కుటుంబం మౌనం పాటిస్తోందని విమర్శించారు.

ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై కే.సీ వేణు గోపాల్‌, సురేశ్‌తో పాటు సంబంధిత నాయకులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదని సమాచారం. మ‌రి గౌర‌వ్ కుమార్ చేసిన ఈ ఆరోప‌ణ‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో చూడాలి. దీనిపై కాంగ్రెస్ అదిష్టానం ఎలా స్పందిస్తుందో అన్న అంశం ఆస‌క్తిగా మారింది.

Scroll to load tweet…