Viral Video: ధైర్యమా, మొండితనమా.? వీడియో చూస్తే గుండె జారాల్సిందే
Viral Video: హైదరాబాద్లోని సంతోష్నగర్–సైదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జి పనులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పనులు జరుగుతున్న తీరు చూస్తే గుండె జారి పోవాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో షాక్కి గురి చేస్తోంది.

పైన పనులు.. కింద ట్రాఫిక్
వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో పైన భారీ గిర్డర్లు, స్టీల్ బ్రేసింగ్లు అమర్చుతుండగా కింద రోడ్డుపై వాహనాల రాకపోకలు ఆపకుండా కొనసాగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పనుల సమయంలో ట్రాఫిక్ను మళ్లించడం లేదా పూర్తిగా నిలిపివేయడం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పట్టపగలు వాహనాలు వెళ్తుండగానే కార్మికులు వంతెనపై పని చేస్తున్నారు.
రక్షణ లేకుండా కార్మికుల పని
వైరల్ వీడియోలో కార్మికులు హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు, భద్రతా షూస్ లేకుండా పని చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వందల కిలోల బరువుండే స్టీల్ భాగాలను గర్డర్ల మధ్య అమర్చేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న తప్పిదం జరిగినా కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఆ భాగాలు కింద పడితే వాహనదారులకూ ముప్పు తప్పదు.
భారీ ప్రాజెక్టు.. కానీ భద్రత ఎక్కడ?
ఈ స్టీల్ వంతెన నిర్మాణం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. సుమారు రూ. 620 కోట్ల వ్యయంతో 2.58 కిలోమీటర్ల మేర నిర్మాణం కొనసాగుతోంది. మూడేళ్లుగా పనులు సాగుతున్న ఈ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు కావాలి. కానీ ప్రస్తుతం బయటపడుతున్న దృశ్యాలు చూస్తే పర్యవేక్షణ లోపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజల్లో ఆగ్రహం.. అధికారులపై ప్రశ్నలు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఏదైనా ప్రమాదం జరిగాకే చర్యలు తీసుకుంటారా?” అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ పనుల సమయంలో తాత్కాలికంగా ట్రాఫిక్ మళ్లించాలనీ, కార్మికులకు పూర్తి భద్రత కల్పించాలనీ డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత ఏజెన్సీల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని కోరుతున్నారు.

