ఆ కుగ్రామం యూట్యూబర్ల హబ్.. ఉపాధి కోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు..!
ఛత్తీస్గడ్లోని ఓ కుగ్రామం యూట్యూబర్లకు హబ్గా ఏర్పడింది. ఆ ఊరి ప్రజలు ఇప్పుడు సుమారు 40 యూట్యూబ్ చానెళ్లు నడుపుతున్నారు. ఎంటర్టైన్మెంట్ మొదలు.. ఎడ్యుకేషన్ వరకు ఎన్నో విభాగాల్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.
రాయ్పూర్: యూట్యూబర్గా మారాలంటే పెద్ద సదువులు సదివి ఉండక్కర్లేదు. టెక్నాలజీ పై కొంత నాలెడ్జ్ ఉంటే చాలు. చేయబోయే కంటెంట్ పై పట్టు ఉండాలి. అంతే.. మొబైల్ ఫోన్లతోనూ యూట్యూబ్ చానెళ్లు నడిపేవారు ఇప్పుడు అసంఖ్యాకంగా ఉన్నారు. ఇందుకు నిదర్శనంగానే పెద్దగా అభివృద్ధి సాధించిన ఛత్తీస్గడ్లో నక్సల్ ప్రాబల్య ప్రాంతంలోని ఓ కుగ్రామం ఇప్పుడు యూట్యూబర్ల హబ్గా మారింది. రాయ్పూర్ సమీపంలోని తుస్లీ గ్రామంలో ఆ ఊరి వాసులు 40 యూట్యూబ్ చానెళ్లు రన్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ మొదలు ఎడ్యుకేషన్ వరకు ఎన్నో విభాగాల్లో వారు కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో ఉపాధి చూసుకుంటున్నారు. కంటెంట్ క్రియేషన్నే వారు ఉపాధిగా ఎంచుకున్నారు.
ఈ గ్రామంలో తొలిసారిగా ఇద్దరు మిత్రులు యూట్యూబ్ చానెల్ ప్రారంభించారు. వారి నుంచే ఆ గ్రామంలో యూట్యూబ్ కల్చర్ మొదలైంది. ఆ తర్వాత చాలా మంది యూట్యూబ్ బాట పట్టారు. జ్ఞానేంద్ర శుక్లా, జై వర్మలు ఈ గ్రామంలో తొలి యూట్యూబ్ పెట్టారు. శుక్లా ఎస్బీఐలో పని చేసేవారు. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి యూట్యూబర్గా మారారు. కాగా, వర్మ టీచింగ్ చేసేవారు. ఆయన కూడా ఆ ఉద్యోగం మానేసి యూట్యూబర్గా మారారు.
ఎస్బీఐలో శుక్లా నెట్వర్క్ ఇంజినీర్గా చేశారు. ఆఫీసులో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండేది. అక్కడ తరచూ యూట్యూబ్ వీడియోలు చూసేవారని శుక్లా చెప్పారు. తనకు అప్పటికే సినిమాలంటే పిచ్చి ఉన్నదని పేర్కొన్నారు. 2011 - 12 కొత్త యూట్యూబ్ వెర్షన్ లాంచ్ చేశారని, ఆ సమయంలో చాలా తక్కువ యూట్యూబ్ చానెళ్లు ఉన్నాయని వివరించారు. అలాగే.. రోజు 9 - 5 జాబ్ పై ఆసక్తి లేదని తెలిపారు. కాబట్టి.. తాను జాబ్ మానేసి యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసినట్టు శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు తాము 250
వీడియోలు రూపొందించామని, సుమారు 1.15 లక్షల సబ్స్క్రైబర్లను సాధించామని చెప్పారు.
అయితే, ముందుగా యూట్యూబ్ వీడియోలు తీయడం గ్రామంలో చాలా కష్టం అయిందని, షూట్ చేస్తూ ఉంటే అందరూ విచిత్రంగా చూసేవారని అన్నారు. బహిరంగ ప్రాంతాల్లో తాము వీడియోలు తీయడం తొలినాళ్లలో చాలా ఇబ్బందిగా ఉండేదని తెలిపారు. ఇప్పుడు గ్రామంలోని ప్రతి ఒక్కరూ వీడియోలు తీసి యూట్యూబ్ నుంచి ఆర్జిస్తున్నారని చెప్పారు.
తమను చూసే గ్రామంలో యూట్యూబ్ వీడియోలు తీయడం ప్రారంభించారని వర్మ తెలిపారు. తాను కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేశానని వివరించారు. పార్ట్ టైమ్ టీచర్గా చేశానని, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా నడిపేవాడని తెలిపారు. అప్పుడు తాను నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు సంపాదించేవారమని, ఇప్పుడు రూ. 30 వేల నుంచి రూ. 35 వేల వరకు సంపాదిస్తున్నామని తెలిపారు.
ఈ యూట్యూబ్ మహిళా సాధికారతనూ పెంపొందిస్తున్నది. పింకి సాహు అనే యూట్యూబర్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, తాను ఏడాదిన్నర కాలంగా యూట్యూబ్ స్టార్ట్ చేశానని వివరించారు. ఇక్కడ సుమారు 40 యూట్యూబ్ చానెళ్లు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ వీటిలో పని చేస్తారని తెలిపారు. సాధారణంగా మహిళలను ఇంటి నుంచి బయటకు పంపరని, కాని, తాము ఇచ్చిన విలువైన సమాచారంతో బాలికలు కూడా ఏదైనా చేయగలరనే సందేశాన్ని ఇచ్చామని వివరించారు.