షాకింగ్.. కమల్ హాసన్ పై కేసు
ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులోని తూత్తికుడిలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. మంగళవారం జరిగిన కాల్పుల్లో 11 మంది మరణించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్ళిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
144 సెక్షన్ అమలవుతున్న ప్రదేశానికి ఆయన వెళ్ళినందుకు ఈ కేసు నమోదు చేశారు. తూత్తికుడిలో హింస చెలరేగిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ ప్రాంతమంతటినీ తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు విలువ లేకుండాపోయిందన్నారు. కాల్పులకు బాధ్యులెవరో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలు సమాధానాలు కోరుతున్నారన్నారు.
వేదాంత గ్రూప్ ఆధ్వర్యంలోని స్టెరిలైట్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించిన నిరసనకారులపై మంగళవారం కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 11 మంది మరణించారు. ఇదిలావుండగా తూత్తుకుడిలో బుధవారం కూడా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరొకరు మరణించినట్లు సమాచారం. కొందరు నిరసనకారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు.