బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ చైర్‌పర్సన్  ఆలం ఫజ్లూర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ పై దాడి చేస్తే తమ సైన్యం పాకిస్థాన్ కు మద్ధతు నిలుస్తుందని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

పహల్గాంలో జరిగిన సంఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు దేశాలు సరిహద్దుల్లో సైనిక సమీకరణ చేస్తున్నాయి. భారత సైన్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన బంగ్లాదేశ్, భారత్‌పై దాడి చేస్తామని హెచ్చరించింది. 

ఏడు రాష్ట్రాలను ఆక్రమిస్తామని హెచ్చరిక

బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ చైర్‌పర్సన్ ఆలం ఫజ్లూర్ రెహమాన్ భారత్‌పై దాడి చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఆయన పలు వివాదాస్పద పోస్టులు చేశారు. 'భారత్ పాకిస్తాన్‌పై దాడి చేస్తే, ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి. ఈ విషయంలో చైనాతో కలిసి సంయుక్త సైనిక చర్యల గురించి చర్చించాలి' అని ఆయన రాసుకొచ్చారు.

'భారత్ పాకిస్తాన్‌ను ధ్వంసం చేయగలిగితే, బంగ్లాదేశ్ స్వాతంత్రం, సార్వభౌమత్వానికి భారత్ నుంచి ఎంత ముప్పు పెరుగుతుందో ఊహించుకోండి! అందుకే పాకిస్తాన్‌కు సైనికంగా మద్దతు ఇవ్వడం మాకు చాలా అవసరం... ఇది వ్యూహాత్మకమైన అంశం. పరస్పరం ఆధారపడటం, భారత్ పాకిస్తాన్‌పై దాడి చేస్తే, చైనాతో కలిసి భారత్‌లోని ఈశాన్య ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవడం ద్వారా భారత్ పాకిస్తాన్‌పై దాడి చేయకుండా ఆపవచ్చు' అని కూడా ఆయన అన్నారు.

హిందువులపై ద్వేషం

ఆలం ఫజ్లూర్ రెహమాన్ కేవలం యుద్ధం గురించే మాట్లాడలేదు. భారత్‌లోని హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని కూడా అనుకుంటున్నారు. 'ఈ ఉపఖండంలో ప్రధానంగా రెండు ముస్లిం దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్. మాల్దీవులు చాలా చిన్నవి, సైనికంగా బలహీనమైనవి కాబట్టి భారత్‌లోని ముస్లింల ప్రయోజనాలను కాపాడలేవు. అందువల్ల భారత్‌లోని ముస్లింలను కాపాడే బాధ్యత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌దే' అని ఆయన తన పోస్టులో రాశారు.

పహల్గాం దాడి

బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి పహల్గాం దాడికి భారతే కారణమని ఆరోపించారు. పాకిస్తాన్‌ను పూర్తిగా నిర్దోషిగా అభివర్ణించారు. 'నరేంద్ర మోడీ ప్రభుత్వం పహల్గాంలో పర్యాటకులను చంపి, పాకిస్తాన్‌పై నింద వేసి, దాడి చేసి ధ్వంసం చేయాలని ప్లాన్ చేసింది. భారత్ పాకిస్తాన్‌ను ధ్వంసం చేయగలిగితే, బంగ్లాదేశ్ స్వాతంత్రం, సార్వభౌమత్వానికి భారత్ నుంచి ఎంత ముప్పు పెరుగుతుందో ఊహించుకోండి! అందుకే పాకిస్తాన్‌కు సైనికంగా మద్దతు ఇవ్వడం మాకు చాలా అవసరం' అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితి

బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు సామాజిక అసమానతలు అభివృద్ధికి ఆటంకంగా మారాయి. బంగ్లాదేశ్ ఆహారం, దుస్తుల కోసం ఇతర దేశాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌కు మిత్రదేశం. కానీ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ యుద్ధ హెచ్చరికలు చేయడం హాస్యాస్పదం అని నిపుణులు అంటున్నారు.