కన్నీటి సాగు.. ఒక్క మరఠ్వాడలోనే 2022లో 1,023 మంది రైతు ఆత్మహత్యలు
Marathwada: మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో 2022లో 1,023 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు, మరికొన్ని చోట్ల అధిక వర్షాలు కురవడంతో పాటు నకిలీ విత్తనాలు, ఎరువుల కారణంగా రైతులకు పంట నష్టం జరిగే ఇబ్బందులు మరింత పెరిగాయని సామాజిక కార్యకర్తలు, అధికారులు చెబుతున్నారు.
1,023 Farmers Died By Suicide In Maharashtra: దేశంలో రైతుల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు, సహాయక కార్యక్రమాల చేపడుతున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అవి కనిపించడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక ఇప్పటికే అన్నదాతలు ఇబ్బందులు పడుతూ చివరకు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని చోట్ల అధిక వర్షాలు లేదా కరువు పరిస్థితులు, నకిలీ విత్తనాలు-ఎరువుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ పంటనష్టం కారణంగా రైతులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనల కారణంగానే మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో 2022లో 1,023 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు, మరికొన్ని చోట్ల అధిక వర్షాలు కురవడంతో రైతులకు పంట నష్టం జరిగే ఇబ్బందులు మరింత పెరిగాయని సామాజిక కార్యకర్తలు, అధికారులు చెబుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో 2022లో 1,023 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని డివిజనల్ కమిషనర్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. జల్నా, ఔరంగాబాద్, పర్భాని, హింగోలి, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో 2001లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా మారాయి. రైతు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2001 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల్లో 10,431 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు డివిజనల్ కమిషనరేట్ గణాంకాలు చెబుతున్నాయి.
2001 నుంచి 2010 వరకు అత్యధికంగా 379 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2011-2020 దశాబ్దంలో అత్యధికంగా 2015లో 1,133 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2001 నుంచి ఆత్మహత్య చేసుకున్న 10,431 మంది రైతుల్లో 7,605 మందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాయం అందింది. అయితే, మిగతా రైతు కుటుంబాలు ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ సాయం కోసం తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు, మరికొన్ని చోట్ల అధిక వర్షాలు కురవడంతో పంట నష్టం జరిగి రైతుల ఇబ్బందులు మరింత పెరిగాయని సామాజిక కార్యకర్తలు, అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని ఇరిగేషన్ నెట్ వర్క్ ను కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించబడటం లేదని వారు తెలిపారు.
జిల్లా యంత్రాంగం సహకారంతో ఉస్మానాబాద్ లో రైతుల కోసం కౌన్సిలింగ్ కేంద్రాన్ని నడుపుతున్న వినాయక్ హెగానా రైతుల ఆత్మహత్యలపై విశ్లేషణ చేస్తూ సూక్ష్మ స్థాయిలో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పైస్థాయిలో విధానాలను రూపొందిస్తున్నామనీ, అయితే క్షేత్రస్థాయిలో అమలును మెరుగుపర్చుకోవచ్చని చెప్పారు. గతంలో జూలై నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగినా ఇప్పుడు తీరు మారింది. డిసెంబర్ నుంచి జూన్ మధ్య ఈ సంఖ్య పెరుగుతోందని చెప్పారు.
ఈ విధానాల్లో లోపాలను గుర్తించి వాటిని మెరుగుపర్చడం నిరంతర ప్రక్రియగా ఉండాలని, దీనిపై పనిచేయగల వ్యక్తుల బృందం ఉండాలని వినాయక్ హెగానా చెప్పినట్టు ఎన్డీటీవీ నివేదించింది. మహారాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వేను సంప్రదించినప్పుడు, "రైతులకు అనేక రుణ మాఫీలు చేసినప్పటికీ, గణాంకాలు (ఆత్మహత్యలు) పెరుగుతున్నాయి. వారి రుణాలను మాఫీ చేసినప్పుడు వారి పంట దిగుబడి కూడా మంచి రాబడి వచ్చేలా చూడాలన్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మడంపై దన్వే ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి వ్యవసాయ రంగానికి హానికరమని అన్నారు."ఈ వ్యవసాయ వనరుల నాణ్యత స్థాయికి అనుగుణంగా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైనది" అని దన్వే అన్నారు.