‘నీకు 10 వేలు ఇస్తా.. నీ భార్యను నా గోడౌన్ కు పంపు..’ ఓ 80 యేళ్ల వృద్ధుడి వికృతం.. విన్న భర్త చేసిన పని...
ఆగస్టు 29న నాయక్ నిందితుడి షాప్ దగ్గరికి వచ్చాడు. పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఉన్నట్లుండి నాయక్ ‘నీకు 10 వేలు ఇస్తాను... నీ భార్యను నా గోడౌన్ కు పంపు.. నాకు ఆమెతో గడపాలని ఉంది’’ అని నిందితుడిని కోరాడు.
ముంబైలో 80 ఏళ్ల వృద్ధుడి హత్య చేశాడు ఓ వ్యక్తి. అన్ని రోజులు మంచివాడిగా కనిపించిన ఆ వృద్ధుడి వికృత ఆలోచనలు తెలిసిన తర్వాత నిందితుడు కుదురుగా ఉండలేకపోయాడు. వృద్ధుడు తన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో వృద్ధుడిని హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని గుట్టుగా మాయం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీ టీవీ ఫుటేజ్ తో పోలీసులకు దొరికిపోయాడు. గత నెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…
షమాకాంత్ తుకరామ్ నాయక్ (80) అనే వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు అతడి సొంతం. ఉల్వే ప్రాంతంలో అతడికి చాలా ఆస్తులు, ప్లాట్లు, భూములు ఉన్నాయి. ఈ క్రమంలో నాయక్ నవీ ముంబై ప్రాంతంలో ఉండే నిందితుడితో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆ ప్రాంతంలో చిన్న దుకాణం నడుపుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో నాయక్ ప్రతి రోజూ నిందితుడి షాప్ దగ్గరికి వెళ్లి పలకరిస్తూ ఉండేవాడు. పెద్ద వయసు వ్యక్తి కావడంతో ప్రతి రోజు రోజు షాప్ దగ్గరికి వచ్చి పలకరిస్తుండటంతో నిందితుడు నాయక్ ని మంచివాడిగా భావించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత నాయక్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. 80 ఏళ్ళ వయసులో కూడా కామంతో కళ్లు మూసుకుపోయి.. నిందితుడి భార్య మీద కన్నేశాడు.
అంతటితో ఆగకుండా ఏకంగా తన వికృత ఆలోచన గురించి నిందితుడుతోనే చెప్పాడు నాయక్. ఈ క్రమంలో ఆగస్టు 29న నాయక్ నిందితుడి షాప్ దగ్గరికి వచ్చాడు. పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఉన్నట్లుండి నాయక్ ‘నీకు 10 వేలు ఇస్తాను... నీ భార్యను నా గోడౌన్ కు పంపు.. నాకు ఆమెతో గడపాలని ఉంది’’ అని నిందితుడిని కోరాడు. అన్ని రోజులు ఎంతో మంచివాడు గా భావించిన వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడేసరికి నిందితుడు తట్టుకోలేకపోయాడు.
నాయక్ ని ఒక్కసారిగా తోసేశాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత షాప్ షట్టర్ క్లోజ్ చేసి నాయక్ ని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత వృద్ధుడి మృతదేహాన్ని బాత్రూంలో ఉంచాడు. ఆగస్టు 31 వరకు నాయక్ మృతదేహాన్ని బాత్రూం లోనే దాచాడు నిందితుడు. దుర్వాసన వచ్చి దొరికిపోతే అనే భయంతో ఆగస్టు 31న నాయక్ మృతదేహాన్ని ఒక బెడ్ షీట్ లో చుట్టి బైక్ మీద తీసుకెళ్లి ఓ కాలువలో పడేసాడు.
అయితే ఇదంతా సీసీటీవీ లో రికార్డ్ అయింది. అయితే అప్పటికే నాయక్ కుటుంబ సభ్యులు అతడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిందితుడు కూడా నాయక్ కుమారుడితో కలిసి వెళ్లి అతడు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 29న ఏం జరిగిందని ఆరాతీస్తే.. నాయక్ చివరిసారిగా నిందితుడి షాప్ దగ్గరే కనిపించాడని.. ఆ తర్వాత మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. షాప్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నాయక్ ను చంపడానికి గల కారణాలు వెల్లడించాడు. అతడిని హత్య చేసిన తర్వాత నాయక్ దుస్తులను, మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి పడేసినట్టు తెలిపాడు.