నితీష్ కుమార్ పాలిటిక్స్.. బిహార్ రాజకీయాల గురించి 10 ఆసక్తికర విషయాలు
బీజేపీతో తెగదెంపులు చేసుకుని బిహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. మళ్లీ పాత దోస్తు ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్, బిహార్ రాజకీయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం.
పాట్నా: బిహార్లో రాజకీయ దుమారం మొదలైన సందర్భంలో సీఎం నితీష్ కుమార్ తమ పార్టీ జేడీయూ ఎంపీలు, ఎమ్మల్యేలతో సమావేశం అయ్యారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నారు. అంటే.. నితీష్ కుమార్ మరోసారి బీజేపీకి హ్యాండ్ ఇచ్చారు. ఎన్డీయే సీఎంగా రిజైన్ చేశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్, బిహార్ రాజకీయాల గురించి ఆసక్తికర విషయాలు చూద్దాం.
1) 2015లో నితీష్ కుమార్ బీజేపీ నుంచి దూరం జరిగి ఆర్జేడీ, కాంగ్రెస్లతో చేతులు కలిపారు. మహాఘట్ బంధన్గా ఏర్పడి ఎన్నికల్లో దిగారు. ఈ కూటమికి ఆధిక్యత వచ్చింది. నితీష్ కుమార్ సీఎంగా, తేజస్వీ డిప్యూటీగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ, ఆ కూటమి ఎంతో కాలం మనలేదు. 2017లో నితీష్ కుమార్ బీజేపీతో మళ్లీ చేతులు కలిపాడు. మహాఘట్ బంధన్ ప్రభుత్వం ముగిసింది. బీజేపీ, జేడీయూ ప్రభుత్వం వెలిసింది.
2) నితీష్ కుమార్కు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రుల్లేరు, శత్రవుల్లేరు. ఆయన ఎవరూ ఊహించని విధంగా ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో చేతులు కలిపారు. మళ్లీ ఆర్జేడీని వదిలి బీజేపీ కూటమిలోకి చేరారు.
3) బీజేపీకి హ్యాండ్ ఇచ్చి ఆర్జేడీ మద్దతుతో సీఎంగా తన మనుగడను ఆయన కాపాడుకున్నారు. ఎన్డీయేలో ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చిన జూనియర్ పార్ట్నర్ జేడీయూ నేత నితీష్నే బీజేపీ సీఎంగా చేసింది. తద్వార జేడీయూ, నితీష్ కుమార్ పాపులారిటీ ఆధారంగా బీజేపీ తన బేస్ పెంచుకోవాలని భావించింది. త్వరలోనే సొంత సీఎంను బీజేపీ ఊహించుకుంది.
4) తాజా నిర్ణయంతో నితీష్ కుమార్ మరోసారి ప్రధాని మోడీకి జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థిగా నిలువగలిగే అవకాశాన్ని మళ్లీ ఏర్పరుచుకున్నారు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు చెప్పుకోలేనంతగా పుంజుకోకుంటే.. 2024 పీఎం క్యాండిడేట్గా నితీష్ కుమార్ ఉంటారనే వాదనలూ కొన్ని ఉన్నాయి.
5) 2013తో పోల్చితే 2022లో నితీష్ కుమార్ అనేక యూటర్న్ల కారణంగా కొంత బలహీనపడ్డారు. కొత్త మిత్రపార్టీ ఆర్జేడీ కూడా ఆయనను పూర్తిగా విశ్వసించకపోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతపైనా షరతులు కుదిరి ఉండొచ్చు.
6) మహారాష్ట్రలో ప్రతిపక్ష ప్రభుత్వం కూలిన తర్వాత బిహార్లో మరో ప్రతిపక్ష ప్రభుత్వం ఏర్పడటం విపక్షాలకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారుతుంది. కాంగ్రెస్కు ఈ భావన ఇంకొంత ఎక్కువ ఉండొచ్చు.
7) బిహార్లో కుల సమీకరణాలు, కూటముల ద్వారా నంబర్ వన్ పార్టీగా ఎదగాలన్న బీజేపీ ప్లాన్కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే. అయితే, నితీష్ కుమార్ ద్రోహం చేశాడనే అంశంతో కొంత మద్దతు కూడగట్టుకోవచ్చు.
8) వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నితీష్ కుమార్ వెళ్లిపోవడం బీజేపీకి కొంత ప్రతికూల విషయంగా మారనుంది. నితీష్ లేకుండా బీజేపీ 2024 ఎన్నికలకు వెళ్లడం సామాజిక రాజకీయంగా తప్పుడు సందేశాన్ని పంపినట్టు అవుతుంది. ఫలితంగా ఓట్లను నష్టపోవచ్చు.
9) ఆర్జేడీ, జేడీయూ ప్రభుత్వం ఏర్పడ్డాక అవినీతి, జంగిల్ రాజ్ వంటి పాత జ్ఞాపకాలను నెమరేస్తూ మళ్లీ పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుంది.
10) బిహార్ అయినా.. హిందీ రాష్ట్రాల్లోనైనా స్థానికంగా బలమైన పార్టీలతో జతకట్టడం మినహా కాంగ్రెస్కు పెద్దగా అవకాశాల్లేవు. బిహార్లో ఇది సరైన అవకాశం. ప్రతిపక్షాల్లోని మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్, గాంధీల వలెనే నితీష్ కుమార్ కూడా టఫ్ లీడర్ అనే విషయం మరువొద్దు.