Jobs : తెలుగు యువత బీ రెడీ... ఏకంగా 68,150 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్..!
దావోస్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు కేవలం లక్షల కోట్ల పెట్టుబడులే కాదు వేలాది ఉద్యోగాలు వస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వెయ్యి రెండువేలు కాదు ఏకంగా 68,150 ఉద్యోగాలు కొత్తగా వస్తున్నాయని స్పష్టం చేశారు.

దావోస్ పెట్టుబడులతో మారనున్న తెలంగాణ రూపురేఖలు..
ఏ దేశ అభివృద్ధిలో అయినా ఇండస్ట్రీస్ పాత్ర చాలా కీలకమైనది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటే ఆ దేశం డెవలప్ చెందుతున్నట్లు లెక్క. అందుకే దేశాధినేతలు విదేశీ పర్యటనలు చేపడుతుంటారు... అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేసే పెద్దపెద్ద బిజినెస్ మెన్స్ తో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానిస్తుంటారు. ఇలా పాలకులను, వ్యాపారవేత్తలను ఒకే తాటిపైకి చేర్చి పరస్పర చర్చలకు అవకాశం కల్పించేందుకే ప్రతి సంవత్సరం దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)సమ్మిట్ నిర్వహిస్తుంటారు.
దావోస్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ...
ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కు ఇండియాలోనే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్ కూడా రెండోసారి ఈ సమ్మిట్ కు హాజరై పారిశ్రామివేత్తలతో సమావేశమయ్యింది... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. తెలంగాణలో వ్యాపార అవకాశాల గురించి వివరించడంతో పాటు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకం అదిస్తుందో తెలిపింది. అనేక సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది.
అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 2024, 2025 ఎకనామిక్ ఫోరం సమ్మిట్స్ ద్వారా ఏకంగా 2.19 లక్షల కోట్ల పెట్టబడులు సమకూరినట్లు... ఇందుకోసం వివిధ కంపెనీలతో 44 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. కేవలం ఒప్పందాలతోనే ఆగిపోలేదు... పలు కంపెనీలకు భూముల కేటాయింపు జరిగిందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
2024 లో మొదటిసారి దావోస్ పర్యటనలో 18 ఒప్పందాల ద్వారా రూ.40,232 కోట్లు... 2025 లో రెండోసారి 26 ఒప్పందాల ద్వారా ఏకంగా రూ.1,78,950 కోట్ల పెట్టబడులను రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇలా ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఒక్కోటిగా వస్తున్నాయని... పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఇప్పటికే రూ.1,540 కోట్ల ఆదాయం..
దావోస్ సదస్సుల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం భూములు కేటాయించిందని... అక్కడ కంపెనీల ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇలా రూ.81,800 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయని... మిగతా కంపెనీలకు భూముల కేటాయింపు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్చలు జరుగుతన్నాయన్నారు. ఇప్పటివరకు భూముల కేటాయింపు, కంపెనీల ఏర్పాటు వంటి వివిధ ప్రక్రియల ద్వారా ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం వచ్చినట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు.
తెలంగాణలో భారీగా ఉద్యోగాలు..
దావోస్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో పెట్టుబడులు వస్తున్నాయి... తద్వారా యువతకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రత్యక్షంగానే 68,150 ఉద్యోగాలు వస్తాయని... పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మొత్తంగా దావోస్ సదస్సులు రాష్ట్ర అభివృద్ధికి, యువత బంగారు భవిష్యత్ కు బాటలు వేయనున్నాయి.
పెట్టుబడుల్లో హైదరాబాద్ పాత్ర...
తెలంగాణలో పెట్టుబడులు అనగానే గుర్తుకువచ్చేది హైదరాబాద్ నగరమే. మెరుగైన రవాణా సదుపాయం, భారీగా ల్యాండ్ బ్యాంక్ కలిగిన ఈ మెట్రో నగరం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. అందుకే భారీ పెట్టుబడులు పెట్టుబడులు వస్తున్నాయి.
ఇప్పుటికే హైదరాబాద్ GCC లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నైపుణ్యం కలిగిన యువతకు కూడా ఇక్కడ లోటు లేదు. వ్యాపారాలకు అనుకూలమైన ఎకోసిస్టమ్ ఉంది. అందుకే గ్లోబల్ కంపెనీలకు గేట్ వే గా హైదరాబాద్ మారింది. ఈ నగరాన్ని చూసే మరిన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు సిద్దం అవుతున్నాయి.
ఇలా హైదరాబాద్ పెట్టుబడులను ఆకర్షించడమే కాదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.. ఈ దిశగా సాగేందుకు పెట్టుబడులు తెస్తున్నారు. తెలంగాణను దేశంలోనే టాప్ లో నిలబెడతామని రేవంత్ సర్కార్ చెబుతోంది... అందుకు తగిన వ్యూహాలతో ముందుకు వెళుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో వెల్లడించారు.

