- Home
- National
- భారత్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్.. భవిష్యత్తులో ఏం జరగనుందంటే?
భారత్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్.. భవిష్యత్తులో ఏం జరగనుందంటే?
AI: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని టెక్ దిగ్గజాలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కాగా ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇందుకు భారత్ను ఎంచుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

భారత్ AI రంగంలో పెట్టుబడులకు పోటీ
భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్గా వేగంగా ఎదుగుతోంది. డిజిటల్ సేవల వినియోగం దేశంలో 100 కోట్ల మందికి పైగా జనాభా ఉండటంతో, ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ను భారీ అవకాశాల మార్కెట్గా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ కంపెనీలు భారత AI ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో AI అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది. 2026 నుంచి 2029 మధ్య 17.5 బిలియన్ డాలర్లు (భారత రూపాయిల్లో లక్షల కోట్ల విలువ) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఇటీవల ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ పెట్టుబడి ద్వారా దేశంలోని AI స్కిల్స్ డెవలప్మెంట్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రాంతంలో చేసిన ఇప్పటి వరకు అతిపెద్ద పెట్టుబడి కావడం విశేషం.
అమెజాన్, గూగుల్ కూడా..
ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్తో పాటు ఇతర కంపెనీలు కూడా భారత్పై దృష్టి సారిస్తున్నాయి. 2030 నాటికి భారత్లో పెట్టుబడిని 3.15 లక్షల కోట్లు దాటేలా పెంచుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సుమారు రూ. 1.14 లక్షల కోట్లు పెట్టుబడులకు కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో డేటా సెంటర్, AI హబ్ అభివృద్ధికి గూగుల్ అడుగులు వేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
రిలయన్స్తో కలిసి మెటా
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిసి AI రంగంలో ఏకంగా రూ. 900 కోట్లు (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడిని ప్రకటించింది.
భారత్లోనే ఎందుకు.?
భారత్లో డిజిటల్ ఎకానమీ ప్రపంచంలోనే వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ఇంటర్నెట్, మొబైల్ వినియోగదారులు ఉన్నారు. వేగంగా విస్తరిస్తున్న స్టార్ట్అప్ ఎకోసిస్టమ్, చౌకైన డేటా, పెద్ద యువ జనాభా, ప్రభుత్వం డిజిటల్ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు.. భారత్ను AI రంగంలో పెట్టుబడికి అత్యుత్తమ ప్రదేశంగా నిలబెడుతున్నాయి. AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి, స్టార్ట్అప్స్కు కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థిక వ్యవస్థకు పెద్ద సపోర్ట్ లభిస్తుంది.
AIతో లాభాలేంటి? సవాళ్లేంటి?
AI వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని ప్రయోజనాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐతో పనుల వేగం పెరుగుతుంది, డేటా విశ్లేషణ త్వరగా పూర్తి అవుతుంది, పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుతుంది, హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం వంటి రంగాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ఇక సవాళ్ల విషయానికొస్తే.. AI ఒక పర్యవేక్షణ వ్యవస్థ మాత్రమే, అందిన డేటాను విశ్లేషించి తిరిగి మనకు చూపిస్తుంది. సమాచారం ఎంత వరకు నిజం అన్నదానిపైసందేహాలు ఉండొచ్చు. వ్యక్తిగత ప్రైవసీకి ప్రమాదం ఉన్న అవకాశం ఉంది. AI సాంకేతికత ప్రమాదకరం కాదు, కానీ దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

