Rain Alert : నేడే బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తెలుగు జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఈ వేసవి ఆరంభంలోనే ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిపించనుంది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

దక్షిణాదిన వర్షాలు
Rain Alert : నేడు (ఫిబ్రవరి 21, శనివారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నాలుగైదు రోజులు దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందని... తెలంగాణలో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతోంది... దీనికి మరో అల్పపీడనం తోడవుతోంది. హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక వైపు కదులుతూ 24 గంటల్లో బలహీనపడనుందట. ఇదే సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీనివల్ల ఫిబ్రవరి 21 నుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలవనున్నాయి.
ఏపీలో వర్షాలు
వరుస అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి 21, 22 రెండ్రోజులు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగతాజిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి ప్రజలు వర్షాల సమయంలో చెట్ల క్రింద ఉండరాదని... అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఫిబ్రవరి 22న ఈ జిల్లాల్లోనే వర్షం..
తెలంగాణపై కూడా అల్పపీడనాల ప్రభావం ఉంటుందని... తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 22న ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిపాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాధారణం నుండి తెలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఫిబ్రవరి 23, 24న తెలంగాణలో వర్షాలు..
ఫిబ్రవరి 23న వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్,వరంగల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఫిబ్రవరి 24న తెలంగాణలో వర్షతీవ్రత తగ్గుతుందని... కొన్ని జిల్లాలకే పరిమితం అవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఆది, సోమ, మంగళవారం తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

