- Home
- Telangana
- IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు.. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలివే..
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు.. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలివే..
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వానలు కురుస్తున్నాయి. తెలంగాణలో అయితే రికార్డు వర్షపాతం నమోదవుతోంది. అత్యధికంగా వర్షం ఎక్కడ కురిసిందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు..
Rain Alert : ఎండలు మండిపోయే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండుమూడు రోజులుగా ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లగా ఉంటోంది... ఇదే సమయంలో కొన్నిచోట్ల చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. ఇలా అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో ప్రజలకు ఎండలనుండి ఉపశమనం లభించింది. ఈ వర్షాలు మరో నాలుగైదురోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది... అంటే ఈ వారమంతా చల్లని గాలులు, చిరుజల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నమాట.
తెలంగాణలో వర్షాలే వర్షాలు
ఇప్పటికే తెలంగాణలో చాలాచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి... కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇలా రాష్ట్రంలో మార్చి 17 వరకు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ ప్రకటించింది. ఎక్కువ వర్షం కురిసిన టాప్ 10 ప్రాంతాలు... ఎంత వర్షపాతం నమోదయ్యిందో తెలుసుకుందాం.
ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలివే...
1. సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో అత్యధికంగా 29.7 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదయ్యింది.
2. మెదక్ జిల్లా రేగోడ్ లో 27.4 mm
3. సంగారెడ్డి జిల్లా మనూరులో 25 mm
4. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 22.8 mm
5. మెదక్ జిల్లా శివ్వంపేటలో 20.3 mm
6. మెదక్ జిల్లా నర్సాపూర్ లో 17.4 mm
7. కామారెడ్డి జిల్లా రాజంపేటలో 15.3 mm
8. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లిలో 12.4 mm
9. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో 12 mm
10. కామారెడ్డి జిల్లా దోమకొండలో 11.7 mm
అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు..
మెదక్ జిల్లాలో అత్యధికంగా 4.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 4.4, కామారెడ్డి జిల్లాలో 2.3, మహబూబ్ నగర్ జిల్లాలో 1.6, నారాయణపేట జిల్లాలో 1.2, వికారాబాద్ జిల్లాలో 1, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 1.4 మి.మీ వర్షం కురిసింది. ఇక యాదాద్రి భువనగిరిలో 0.9, సిద్దిపేటలో 0.5, హైదరాబాద్ 0.5, జనగాం 0.3, కొమ్రంభీం ఆసిఫాబాద్ 0.3, రాజన్న సిరిసిల్ల 0.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది.
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
ఇదిలావుంటే ఇవాళ (మార్చి 18, బుధవారం) తెలంగాణవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఇవాళ ఉదయం పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఆదిలాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని... గాలి వేగం 40 కి.మీ గా ఉంటుందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్, కరీంనగర్, కొమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 41 నుండి 61 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు...
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ (బుధవారం) అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. వర్ష సమయంలో ఈదురుగాలులు, పిడుగుల ప్రమాదం పొంచివుంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది.

