- Home
- Andhra Pradesh
- Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారింది. రాగల 3 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

ఏపీ, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో వానలే వానలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తూ మాడ పగలేలా ఎండలతో ఉడికించేస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా ఆకాశం నల్లబడి మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. ఈ విచిత్రమైన వాతావరణ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఒకేసారి తీవ్రమైన ఎండలు, అలాగే పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
అకస్మాత్తుగా మారిన సీన్.. అసలు కారణం ఇదే
వాతావరణంలో ఇంత సడన్ చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకు ఒక భారీ ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుంచి విదర్భ వరకు 900 మీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కూడా ఫామ్ అయింది. ఈ డబుల్ ఎఫెక్ట్ వల్లే వాతావరణంలో ఈ అకస్మాత్తు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ద్రోణుల కదలికల వల్ల రానున్న నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వేగంగా విస్తరించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వానలు దంచికొట్టే జిల్లాలు ఇవే.. 50 కిమీ వేగంతో గాలులు
ద్రోణి ఎఫెక్ట్తో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వీటితో పాటు అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు.
వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. తెలంగాణలో కూడా గురువారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని హిమాయత్నగర్లో 7 సెం.మీ, గచ్చిబౌలిలో 5 సెం.మీ, గోల్కొండలో 3 సెం.మీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది.
అధికారుల హెచ్చరికలు
ఇలాంటి సడన్ రైన్స్ అండ్ ఈదురుగాలుల టైంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద నిలబడకూడదు. పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలి. భారీ గాలుల వల్ల కరెంట్ వైర్లు తెగిపడే ఛాన్స్ ఉంది కాబట్టి, రోడ్లపై వెళ్లేటప్పుడు తెగిన వైర్లు కనిపిస్తే వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
పలు ప్రాంతాల్లో మండే ఎండలు
వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. జూన్ 11న ఏపీలోని 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 42 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. విజయనగరం జిల్లాలోని బొండపల్లి, గజపతినగరం.. పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, పార్వతీపురం.. కాకినాడ అర్బన్, రూరల్.. అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలాల్లో ఎండ దెబ్బ గట్టిగా తగలనుంది. రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో టెంపరేచర్స్ 41 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని అంచనా.

