Heavy Rains Alert : బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలంగాణ, ఏపీలకు వాతావరణ శాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి పసిఫిక్ మహాసముద్రంలో కదిలిన 'డాల్ఫిన్ టైఫూన్' ప్రభావం తోడవ్వడంతో రుతుపవనాలు మరింత యాక్టివ్ అయ్యాయి. ఈ అల్పపీడన వ్యవస్థ క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ దిశగా పయనిస్తూ మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్తో సహా ఆ జిల్లాలకు అలర్ట్
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వానలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
రాజధాని హైదరాబాద్లో ఇప్పటికే పటాన్చెరు, మియాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రాత్రి వర్షం దంచికొట్టింది. రాబోయే గంటల్లోనూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల సూచన
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. రుతుపవనాలు చురుకుగా మారడంతో కోస్తా, రాయలసీమలోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉంది.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సముద్రం అలజడిగా మారనున్నందున తదుపరి 24 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు గట్టిగా హెచ్చరించారు.
పొరుగు రాష్ట్రాల్లో కుండపోత: బెంగాల్, ఒడిశాల్లో తీవ్ర ప్రభావం
ఈ తీవ్ర అల్పపీడనం వల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో వాతావరణం మరింత తీవ్రంగా మారింది. దక్షిణ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కోల్కతా, హౌరా, హుగ్లీ, బాంకురా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. తీవ్రమైన మేఘావృతం వల్ల కోల్కతాలో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే తగ్గి 28 డిగ్రీలకు పడిపోయింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని ఒడిశా జిల్లాలైన బాలాసోర్, భద్రక్, మయూర్ భంజ్, సుందర్గఢ్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలీపూర్ రీజినల్ ఐఎండీ తెలిపింది.
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రయాణికులు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల వల్ల నగరాల్లో రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి. వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఐరన్ హోర్డింగుల కింద నిలబడకూడదు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడం మంచింది. పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు పంట పొలాల్లో నీరు నిలవకుండా డ్రైనేజీ వసతి సరిచూసుకోవాలని వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగాలు తెలిపాయి.

