- Home
- Telangana
- IMD Rain Alert : ఈ వీకెండ్ హైదరాబాద్ లో కూల్ కూల్ వెదర్.. ఈ జిల్లాల్లో రెండుమూడు రోజులు వర్షాలే
IMD Rain Alert : ఈ వీకెండ్ హైదరాబాద్ లో కూల్ కూల్ వెదర్.. ఈ జిల్లాల్లో రెండుమూడు రోజులు వర్షాలే
Weather Updates : తెలంగాణ ప్రజలకు ఎండలనుండి ఉపశమనం లభించనుంది. రాబోయే రెండుమూడు రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

తెలుగు ప్రజలకు కూల్ న్యూస్
IMD Rain Alert : తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ప్రస్తుతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి... ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో ఎండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలకు వడగాలులు, ఉక్కపోత తోడవడంతో ప్రజలు మరింత ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షాలు కురిస్తే... వాతావరణం చల్లబడి ఎండల నుండి ఉపశమనం లభించనుంది. రేపట్నుంచి (ఏప్రిల్ 18, శనివారం) ఇదే జరగనుంది అంటున్నారు వాతావరణ నిపుణులు.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో ఏప్రిల్ 18 నుండి వర్షాలు మొదలవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం... ఏప్రిల్ 18 లేదా 19న హైదరాబాద్ శివారుజిల్లాలు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ లో వర్షాలు కురుస్తాయట. ఈ వర్షాలు క్రమంగా తెలంగాణవ్యాప్తంగా విస్తరిస్తాయని... ఏప్రిల్ 20-24 వరకు కొనసాగుతాయని ప్రకటించారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
హైదరాబాద్ లో వర్షాలు
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. నగరంలో ఏప్రిల్ 19 నుండి 23 వరకు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ వర్షాల కారణంగా మధ్యాహ్నం ఎండల తీవ్రత కూడా కాస్త తగ్గుతాయట... అంటే నగరవాసులకు కూడా ఎండల నుండి కాస్త ఉపశమనం లభించనుంది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏప్రిల్ 20 (సోమవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం,వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల సమయంలో ఈదురుగాలులు, పిడుగుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో ఇవాళ మండుటెండలు
తెలంగాణలో ఈ రెండ్రోజులు అంటే శుక్ర, శనివారం (ఏప్రిల్ 17,18) పొడి వాతావరణమే ఉంటుందని... ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్నిచోట్ల 41 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. అయితే వర్షాలు మొదలయితే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఎండల నుండి ఉపశమనం లభించనుంది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం..
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ (శుక్రవారం) మండుటెండలు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43°C - 44.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంట. మొత్తంగా 28 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాలులు, 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
ఈ మండుటెండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ తగిలే అవకాశాలుంటాయి.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటపుడు టోపీ ధరించడం, గొడుగు వాడటం మంచిది... మంచినీరు ఎక్కువగా తాగి శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

