- Home
- Andhra Pradesh
- Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల 46 డిగ్రీల ఎండలు మండిపోతుంటే, మరికొన్ని చోట్ల వానలు దంచికొడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాల కురిసే అవకాశముందని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది.

రుతుపవనాలు వస్తున్నాయి.. కానీ, ఏపీ తెలంగాణలో వింత వెదర్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రూట్ మార్చింది. ఒక పక్క భానుడు తన ప్రతాపం చూపిస్తూ నిప్పుల కొలిమిని తలపిస్తుంటే, మరోపక్క సడెన్గా నల్లటి మబ్బులు కమ్ముకుని పిడుగులతో వర్షాలు పడుతున్నాయి. ఈ వింత వాతావరణాన్ని చూసి జనాలు షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కొద్దిగా జోరు పెంచాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల నుంచి వస్తున్న గాలి ప్రవాహాలు ఈ రుతుపవనాలను ఇండియా వైపు వేగంగా నెడుతున్నాయి. లక్షద్వీప్, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి రాబోయే రెండు మూడు రోజుల్లో విస్తరించే ఛాన్స్ ఉంది. మే 31 లేదా జూన్ 1వ తేదీ కల్లా రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
బంగాళాఖాతంలో ఆవర్తనాలు
ప్రస్తుతం సముద్రంలో జరుగుతున్న మార్పుల వల్లే ఈ సడెన్ ట్విస్టులు కనిపిస్తున్నాయి. తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీనివల్ల సముద్ర మట్టానికి దాదాపు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీగా మేఘాలు పేరుకుపోయాయి. అటు ఆగ్నేయ అరేబియా సముద్రంలో కూడా మరో ఆవర్తనం యాక్టివ్గా ఉంది. వీటికి తోడు తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో మూడో ఆవర్తనం కూడా తోడైంది.
దీని ప్రభావం వల్ల మేఘాలు ఏకంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయి. ఉత్తరాంధ్ర మీదుగా ఉన్న మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో చేరింది. ఇది కనుక మరింత బలపడితే అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో గంటకు 57 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఏపీలో 46 డిగ్రీల మంట.. ఎక్కడెక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఎండల తీవ్రత నెక్స్ట్ లెవెల్లో ఉంది. శనివారం నాడు రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.
విజయనగరం, గోదావరి జిల్లాలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీలు.. రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి. ఆదివారం నుంచి ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సడెన్ పిడుగుల అలర్ట్.. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు
ఇంతటి ఎండల్లోనే ఐఎండీ భారీ వర్షాలు, పిడుగుల అలర్ట్ ఇచ్చింది. మే 30 నుంచి జూన్ 2 వరకు కోస్తాంధ్రా, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలో పిడుగులు, మెరుపులతో కూడిన లైట్ టు మోడరేట్ వానలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మే 30, 31 తేదీల్లో తీర ప్రాంత ఏపీలో పిడుగులు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
వాన పడటానికి ముందు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, కొన్నిసార్లు ఏకంగా 70 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీస్తాయి.
గ్లోబల్ ఎఫెక్ట్.. టైపూన్ జంగ్మీ అలజడి
ఇక ప్రపంచ వాతావరణ పరిస్థితులను చూస్తే.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన టైపూన్ జంగ్మీ (Typhoon Jangmi) క్రమంగా బలపడుతోంది. ఇది గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటోంది. ఇది ఎల్ నినో కి మరింత బూస్ట్ ఇస్తుండటంతో ఆగ్నేయ ఆసియా వైపు వేడి గాలులు వీచే ప్రమాదం ఉంది. అయితే భారత్ చుట్టుపక్కల మాత్రం భూమధ్యరేఖ అంతటా మేఘాలు దట్టంగా ఉన్నాయి.

