- Home
- Telangana
- Summer Heat : ఏంటిది సూరీడూ.. తెలుగు నేలపై 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలా..! ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?
Summer Heat : ఏంటిది సూరీడూ.. తెలుగు నేలపై 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలా..! ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?
Summer Heat : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే కూడా రాలేదు… అప్పుడే పలుచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండనుందో..? ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?

నిప్పుల కుంపటిలాా తెలుగు రాష్ట్రాలు..
Summer Heat : తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు... ఈ ఎండలను చూసి ప్రజలు భయపడిపోతున్నారు. సాధారణంగా మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి... కానీ ఈసారి ఏప్రిల్ లోనే ఎండలు ముదిరాయి. ఇండియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు రాజస్థాన్ థార్ ఎడారి ప్రాంతంలో నమోదవుతుంటాయి… ఇక్కడ 50 డిగ్రీలకు పైగా ఉంటాయి. అయితే ఈ రికార్డును ఈసారి తెలుగు రాష్ట్రాలు బద్దలుకొడతాయా అనే స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండలు, వడగాలుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు పోటీ పడుతున్నాయి... ఒకచోటుకు మించి మరోచోట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
44 డిగ్రీల ఉష్ణోగ్రతలేంటి గురూ..!
ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న(ఏప్రిల్ 12, ఆదివారం) హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. రాయలసీమ కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 43.8°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1°C, నంద్యాలలో 42.9°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. అంటే దేశ రికార్డు ఉష్ణోగ్రతకు కేవలం 6 డిగ్రీలు తక్కువన్నమాట. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే లో ఏస్థాయి ఎండలు ఉంటాయోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు.
ఇక్కడే హయ్యెస్ట్ టెంపరేచర్స్... తస్మాత్ జాగ్రత్త
ఇవాళ (ఏప్రిల్ 13, సోమవారం) ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతుందని APSDMA హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని 51 మండలాల్లో తీవ్రవడగాలులు, 49 మండలాల్లో వడగాలులు కొనసాగుతాయని ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు... కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలొ అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయట. అలాగే అల్లూరి సీతారామరాజు. అనకాపల్లి, ఏలూరు, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇలాగే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయట..ఈ ప్రాంతాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఎండలు, పిడుగుల ప్రమాదం..
ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని విపత్తు సంస్థ హెచ్చరిస్తోంది. ద్రోణి ప్రభావంతో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించింది. ఎండలు, పిడుగులు ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
తెలంగాణలో భానుడి భగభగలు
ఎండలు, అధిక ఉష్ణోగ్రతల విషయంలో తెలంగాణ కూడా ఏపీతో పోటీ పడుతోంది. ఇక్కడ కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి... వడగాలులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, భద్రాచలం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో కూడా 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ నగరవాసులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు..
ఇవాళ (ఏప్రిల్ 13, సోమవారం) నార్త్ తెలంగాణలో అత్యధికంగా 42 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదైనా వడగాలులు, ఉక్కపోత కారణంగా 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- బయటకు వెళ్లేప్పుడు తలకి టోపీ లేదా రుమాలు ధరించండి. మంచినీళ్లు తీసుకెళ్లండి.
- తెలుపు రంగు కాటన్ వస్త్రాలు, సన్ గ్లాసెస్ ఉపయోగించండి.
- మంచినీరు, అందుబాటులో ఉంటే కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగండి.
- గుండె జబ్బులు, బిపి, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగవద్దు.
- ముసలివారు, చిన్నారుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.
- మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దు... ఏవైనా పనులుంటే ఉదయం లేదా సాయంత్రం చూసుకోవాలి.

