- Home
- Telangana
- Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్ టూ ముంబై 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ! ఇక విమానం ఎక్కాల్సిన అవసరం లేదు!
Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్ టూ ముంబై 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ! ఇక విమానం ఎక్కాల్సిన అవసరం లేదు!
Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్-ముంబై మధ్య రైలు ప్రయాణం 3 గంటలకు తగ్గనుంది. దీని కోసం హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్కు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రాజెక్టు వివరాలు ఇలా ఉన్నాయి..

15 గంటల ప్రయాణం కేవలం 3 గంటలే.. తెలంగాణ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లాలంటే ప్రస్తుతం రైలులో దాదాపు 14 నుంచి 15 గంటల సమయం పడుతుంది. కానీ, భవిష్యత్తులో ఈ ప్రయాణం కేవలం 3 గంటలకు తగ్గనుంది. తెలంగాణ ప్రభుత్వ హైదరాబాద్-పుణె-ముంబై హై-స్పీడ్ రైల్ కారిడార్కు సంబంధించిన డీపీఆర్ రెడీ అయింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దక్షిణ, పశ్చిమ భారతం మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది.
సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా చేసుకుని పొరుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
761 కిలోమీటర్ల మేర కారిడార్.. గంటకు 330 కి.మీ వేగం
ఈ ప్రతిపాదిత కారిడార్ మొత్తం 761 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు గంటకు 320 నుండి 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. దీంతో హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణ సమయం మూడు గంటలకు తగ్గనుంది. ఈ మార్గంలో దాదాపు 10 నుండి 12 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఎలివేటెడ్ ట్రాక్లు, భూగర్భ మార్గాలు ఉంటాయి.
వికారాబాద్ వద్ద 5 కిలోమీటర్ల టన్నెల్
ఈ ప్రాజెక్టులో ఇంజనీరింగ్ పరంగా కొన్ని అద్భుతమైన నిర్మాణాలు కూడా ఉండనున్నాయి. వికారాబాద్ సమీపంలో సుమారు 4 నుండి 5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు తర్వాత దేశంలోనే అత్యంత కీలకమైన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుగా ఇది నిలవనుంది.
రూ. 2 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయం
ప్రాథమిక డీపీఆర్ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇతర హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల వ్యయంతో పోల్చి ఈ అంచనాకు వచ్చారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధుల లభ్యత, సాంకేతిక అంశాలను చెక్ చేసిన తర్వాత మొత్తం ఖర్చు ఎంతనేది ఫైనల్ కానుంది. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది.
2027-28లో ప్రారంభం కానున్న పనులు?
డీపీఆర్ రెడీ అయిన నేపథ్యంలో, నెక్ట్స్ కేంద్రం నుంచి అనుమతులు పొందడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో ఈ కారిడార్ నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. నిర్మాణం ప్రారంభమైన తర్వాత 6 నుండి 8 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు
ఈ కారిడార్ కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంతో కీలకం కానుంది. హైదరాబాద్, పుణె, సోలాపూర్, ముంబై వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలను కలపడం ద్వారా వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ముంబైతో పాటు బెంగళూరు, చెన్నై నగరాలకు కూడా హై-స్పీడ్ రైలు మార్గాలను అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ రెడీ చేస్తోంది.

