- Home
- Telangana
- Vande Bharat Sleeper : హైదరాబాద్ టు డిల్లీ ట్రైన్ జర్నీ ఇక విమానం కంటే లగ్జరీ.. వందే భారత్ స్లీపర్ ఎక్కితే వావ్ అనాల్సిందే!
Vande Bharat Sleeper : హైదరాబాద్ టు డిల్లీ ట్రైన్ జర్నీ ఇక విమానం కంటే లగ్జరీ.. వందే భారత్ స్లీపర్ ఎక్కితే వావ్ అనాల్సిందే!
Vande Bharat Sleeper Train : వందే భారత్ రైలులో ప్రయాణమే మహా అద్భుతంగా ఉంటుంది. అలాంటిది వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో ప్రయాణం ఇంకెలా ఉంటుందో..? ఈ అనుభూతి త్వరలోనే తెలుగు ప్రజలకు దక్కనుంది.

హైదరాబాద్ కు వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది...
భారతీయ రైల్వే చరిత్రలో ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ ఒక సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఇప్పటివరకు కేవలం సిట్టింగ్ (చైర్ కార్) సదుపాయంతో పగటిపూట ప్రయాణాలకే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్ రైలు, ఇప్పుడు సరికొత్తగా ‘స్లీపర్’ వెర్షన్లో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. సుదూర ప్రాంతాలకు రాత్రి వేళల్లో ప్రయాణించే వారి కోసం అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన సదుపాయాలతో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను రూపకల్పన చేశారు. ఇప్పటికే కలకత్తా, గౌహతి నగరాల మధ్య ఈ స్లీపర్ ప్రయాణిస్తుండగా త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూత పెట్టనుంది.
దేశవ్యాప్తంగా అనేక నగరాలను అనుసంధానం చేస్తూ ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ నడపనున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి దేశ రాజధాని న్యూడిల్లీకి కూడా ఓ వందే భారత్ స్లీపర్ నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే త్వరలోనే తెలుగు ప్రజలకు వందేభారత్ స్లీపర్ జర్నీ అందుబాటులోకి రానుందన్నమాట. ఈ ట్రైన్ లో జర్నీ విమాన ప్రయాణంకంటే లగ్జరీగా ఉంటుందనే ప్రచారం ఉంది.. మరి వందే భారత్ స్లీపర్ లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయో చూద్దాం.
సుదూర ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్ వందే భారత్ స్లీపర్
ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్న వందే భారత్ ట్రైన్లను పగటిపూట ప్రయాణాల కోసం చైర్ కార్ కోచ్లతో డిజైన్ చేశారు. కానీ ఈ కొత్త స్లీపర్ వెర్షన్ను సుదూర రాత్రి ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో అభివృద్ధి చేశారు. ప్రయాణికులకు ఎక్కువ ప్రైవసీ, సౌకర్యం ఉండేలా కోచ్లను డిజైన్ చేసింది రైల్వే శాఖ.
ఇటీవల బయటకు వచ్చిన ఫొటోలను బట్టి చూస్తే ఈ వందేభఆరత్ స్లీపర్ ట్రైన్ లోపల చాలా నీట్ లేఅవుట్, స్పేస్ను చక్కగా వాడుకోవడం, ఆకట్టుకునే ఫినిషింగ్, ఆధునిక లైటింగ్ సిస్టమ్ ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ఎక్కగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక లగ్జరీ హోటల్ రూమ్ లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో కొత్త ఫీచర్లను ఇందులో చేర్చారు. ముఖ్యంగా బయటినుండి కోచ్లలోకి ప్రవేశించేందుకు, రైలు లోనే ఒక కోచ్ నుండి మరో కోచ్కి వెళ్లేందుకు సెన్సార్తో పనిచేసే ఆటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేశారు.
సీసీటీవీ కెమెరాలతో పాటు భద్రతా వ్యవస్థలు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లు, కొత్తరకం టాయిలెట్లు, మెరుగైన బెర్త్ డిజైన్, ఎక్కువ ప్రైవసీ కోసం స్లైడింగ్ డోర్లతో కూడిన క్యాబిన్లు ఈ ట్రైన్ ప్రత్యేకతలు. అంతేకాదు పై బెర్త్లకు ఎక్కడానికి మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా మెట్లు కూడా ఏర్పాటు చేశారు.
వందే భారత్ స్లీపర్ లో శబ్దం లేకుండా కంఫర్ట్ జర్నీ
రైలు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది దాని శబ్దమే... ఇది ప్రయాణికులకు ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో వేగంగా వెళ్లే రైలు సౌండ్ కు చాలామందికి నిద్రపట్టదు. అయితే వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో ఈ సమస్య ఉండదు... ప్రయాణికులకు ఎలాంటి శబ్దాలు వినపడకుండా ‘నాయిస్ ఇన్సులేషన్’ సాంకేతికతను ఉపయోగించారు. దీనివల్ల ప్రయాణికులు హాయిగా నిద్రపోవచ్చు.
ఇక సాధారణ రాజధాని, ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్లో సీట్లు, బర్త్ల కంఫర్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. బర్త్లపై ప్రయాణికులు పడుకున్నప్పుడు ఎంతో హాయిగా ఉండేలా ఎక్స్ట్రా ఫోమ్ కుషనింగ్ను అందించారు. అలాగే సాధారణ రైళ్లలో మాదిరిగా కాకుండా అప్పర్ బెర్త్ పైకి ఎక్కడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన మెట్లను (Ladders) ఏర్పాటు చేశారు. ప్రతి బర్త్ దగ్గర లగేజీ పెట్టుకోవడానికి, కాళ్లు చాపుకోవడానికి సాధారణ రైళ్ల కంటే ఎక్కువ స్థలం (Legroom) ఉంటుంది.
విమానం ఉన్నట్లే బయో-వాక్యూమ్ టాయిలెట్లు
వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో వాష్రూమ్లను విమానాల్లో ఉండే టాయిలెట్ల తరహాలో అత్యాధునికంగా తీర్చిదిద్దారు… బయో వాక్యూమ్ టాయిలెట్లు అమర్చారు. ప్రత్యేకమైన బ్యాక్టీరియా సాయంతో మానవ వ్యర్థాలను సమర్థంగా, పరిశుభ్రంగా నిర్వహించే టెక్నాలజీయే ఇది. ఇందులో చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది… అంటే నీరు ఆదా చేసే టాయిలెట్స్ అన్నమాట.
ఇక వందేభారత్ స్లీపర్ ట్రైన్ లో ట్యాప్లు, ఫ్లష్లు, సోప్ డిస్పెన్సర్లు అన్నీ టచ్-ఫ్రీ (సెన్సార్) పద్ధతిలో పనిచేస్తాయి. వాష్రూమ్లలో లైటింగ్తో కూడిన ఎల్ఈడీ అద్దాలను అమర్చారు… ఇవి టాయిలెట్లకు రిచ్ లుక్ తీసుకువస్తున్నాయి. ప్రయాణికుల కోసం గిజర్ల ద్వారా వేడి నీటి సదుపాయాన్ని కూడా కల్పించారు.
వందే భారత్ స్లీపర్ లో అత్యాధునిక భద్రతా వ్యవస్థ
ఈ వందే భారత్ స్లీపర్ లో ప్రయాణికుల భద్రతకే రైల్వే శాఖ అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే ప్రమాదాలు జరగకుండా ఆటోమేటిక్గా బ్రేకులు వేసే యాంటీ-కొలిజన్ సిస్టమ్ 'కవచ్' ఇందులో ఉంది. ప్రతి కోచ్లోనూ అధునాతన ఫైర్ డిటెక్షన్ ఆండ్ సప్రెషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్రమాదవశాత్తూ పొగ వచ్చినా వెంటనే అలారమ్ మోగుతుంది.
ఈ స్లీపర్ ట్రైన్ ప్రయాణికుల రక్షణ కోసం కోచ్లలో, కారిడార్లలో నిరంతరం నిఘా ఉంచే సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు నేరుగా లోకో పైలట్ (డ్రైవర్)తో మాట్లాడేందుకు వీలుగా ఎమర్జెన్సీ టాక్బ్యాక్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇలా అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వందే భారత్ స్లీపర్ ను తయారుచేయించింది ఇండియన్ రైల్వే.
వందేభారత్ స్లీపర్ ట్రైన్ లో ఆకట్టుకునే సదుపాయాలు
వ్యక్తిగత రీడింగ్ లైట్లు : తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పుస్తకాలు చదువుకోవడానికి ప్రతి బెర్త్కూ ప్రత్యేక రీడింగ్ లైట్లు ఉన్నాయి.
చార్జింగ్ పాయింట్లు : మొబైల్స్, లాప్టాప్ల కోసం ప్రతి సీటు వద్ద USB ఛార్జింగ్ పోర్టులతో పాటు అధునాతన టైప్-సి (Type-C) పోర్టులు కూడా ఇచ్చారు.
మినీ ప్యాంట్రీ : ప్రతి కోచ్లోనూ ప్రయాణికులకు వేడి వేడి ఆహారాన్ని, పానీయాలను అందించేందుకు మినీ ప్యాంట్రీ యూనిట్లను కేటాయించారు.
జెర్క్-ఫ్రీ ప్రయాణం : రైలు స్టార్ట్ అయినప్పుడు లేదా ఆగినప్పుడు ప్రయాణికులకు ఎలాంటి కుదుపులు (Jerks) తెలియకుండా ప్రత్యేక ‘కప్లర్స్’, సస్పెన్షన్ సిస్టమ్ను వాడారు.
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉన్న వందే భారత్ స్లీపర్ రైళ్లు, భారతీయ ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభూతిని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ సమయంలో, లగ్జరీగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునే వారికి ఈ రైలు ఒక వరమనే చెప్పాలి. అయితే సికింద్రాబాద్-డిల్లీ మధ్య ఈ ట్రైన్ సర్వీస్ ఎప్పుడు మొదలవుతుంది, టైమింగ్స్, టికెట్ ధరలు వంటి వివరాలను ఇండియన్ రైల్వేస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలోనే సర్వీసులు ప్రారంభమవుతాయని సంకేతాలు వస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్-డిల్లీ మధ్య ప్రయాణ సమయం 3 నుండి 4 గంటలు తగ్గుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.

