- Home
- Telangana
- Heavy Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలంటే?
Heavy Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలంటే?
Heavy Rain Alert : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే ఛాన్స్ ఉండటంతో అలర్ట్ ప్రకటించారు.

వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: ఈ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దానికి తోడు నైరుతి రుతుపవనాలు స్పీడుగా విస్తరిస్తుండటంతో వానలు దంచికొట్టబోతున్నాయి.
ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో జూన్ 25న పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వానలు పడనున్నాయి.
జూన్ 26, 27 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం పడే టైంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అయితే కొన్ని చోట్ల ఎండ తీవ్రత కూడా ఉంది. బుధవారం పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 39.5 డిగ్రీలు, తిరుపతిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
తెలంగాణలో వానల మోత.. జూన్ 30 వరకు అలర్ట్
తెలంగాణలో ఈ నెల 30 వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ 'యెల్లో అలెర్ట్' జారీ చేసింది. ఇక శుక్రవారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
వీటితో పాటు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా వానలు పడతాయని అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్ వాతావరణం అప్డేట్
గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా ఓదెలలో 42.2 మి.మీ, కాల్వశ్రీరాంపూర్లో 40.9 మి.మీ, ముత్తారంలో 20 మి.మీ, అంతర్గాంలో 19.7 మి.మీ, రామగుండంలో 13.8 మి.మీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 19.6 మి.మీ వర్షం కురిసింది. భారీ వానల వల్ల ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ వీధిలో ఒక పెంకుటిల్లు పైకప్పు కూలిపోయింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే బుధవారం సాయంత్రం బాచుపల్లి, నిజాంపేట్ ఏరియాల్లో అరగంట పాటు పడిన వానకే రోడ్లు జలమయమయ్యాయి. గురువారం కూడా వానలు పడతాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ఐఎండీ అంచనాల మధ్య అధికారులు ప్రజలకు హెచ్చరించారు. వానలు పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం పడేటప్పుడు ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల పక్కన గానీ అస్సలు నిలబడకూడదు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

