మీరు ఎక్కేలోపే వందే భారత్ ట్రైన్ డోర్లు క్లోజ్ అయితే... ఏం చేయాలో తెలుసా..?
Tips And Trick : మీరు వందే భారత్ రైల్లో ప్రయాణించాల్సి ఉందనుకుందాం. కానీ రైల్వే స్టేషన్ కు వెళ్లడం కాస్త ఆలస్యం కావడంతో ట్రైన్ డోర్లు క్లోజ్ అయ్యాయి. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా?

రైలు ప్రయాణ చిట్కాలు..
Vande Bharat Train : ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్. స్వదేశీ సాంకేతికతతో తయారుచేసిన ఈ రైలును 2019 నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది మోదీ సర్కార్. కేవలం స్పీడ్ మాత్రమే కాదు సాధారణ రైళ్లకంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి…సౌకర్యవంతమైన సీటింగ్ కలిగి ఉంటుంది.. అలాగే ప్రయాణికులకు, వైఫై, నాణ్యమైన ఫుడ్, మరింత భద్రత లభిస్తుంది. ఈ రైలు మరో ప్రత్యేకత ఏంటంటే అటోమేటిక్ ప్లగ్ డోర్లు... అంటే నిర్ణీత సమయంలో డోర్లు వాటికవే మూసుకుపోతాయన్నమాట.
అయితే వందే భారత్ రైల్లో ప్రయాణించేవారికి కొన్నిసార్లు ఈ ఆటోమేటిక్ డోర్ల వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. చాలా తక్కువ సమయం డోర్లు తెరిచివుండటం వల్ల కొందరు ట్రైన్ మిస్ అవుతున్నారు... మరికొందరు గమ్యస్థానంలో దిగలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
వందే భారత్ ట్రైన్ డోర్లు మూసుకుపోతే ఏం చేయాలి..?
తొందరగా గమ్యస్థానాలకు చేరాలని భావించేవారే వందే భారత్ రైల్లో ప్రయాణాన్ని కోరుకుంటారు. అయితే రైల్వే స్టేషన్ కు చేరుకోవడం ఆలస్యం అవడంతో కొందరు వందే భారత్ ట్రైన్ మిస్ అవుతుంటారు. ట్రైన్ మనముందే మెళ్ళిగా కదులుతున్నా పరుగెత్తి ఎక్కలేం... ఎందుకంటే అప్పటికే అన్ని డోర్లు ఆటోమెటిక్ గా క్లోజ్ అవుతాయి.
అయితే ఇలాంటి సమయంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తే ట్రైన్ ను పట్టుకోవచ్చు. వందే భారత్ ట్రైన్ ట్రైన్ అన్నిబోగీల డోర్లు క్లోజ్ అయినా చివర్లో గార్డ్ ఉండే బోగీ మాత్రం తెరిచివుంటుంది. కాబట్టి వెంటనే చివరిబోగీ వద్దకు చేరుకుని గార్డు బోగీలో ఎక్కవచ్చు... అక్కడినుండి మీరు బుక్ చేసుకున్న సీటువద్దకు చేరుకోవచ్చు.
దిగకుండానే డోర్లు క్లోజ్ అయితే ఏం చేయాలి..?
లగేజీ ఎక్కువగా ఉండటంతో కొందరు నిర్ణీత సమయంలో వందే భారత్ రైలులోంచి దిగలేకపోతారు. ఇలాంటి సమయంలో కూడా చివరి బోగీకి చేరుకుని గార్డును రిక్వెస్ట్ చేసి దిగిపోవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే ముందుగానే లగేజీతో డోర్ వద్దకు చేరుకోవడం ఉత్తమం.
వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ప్రారంభం...
వందే భారత్ ట్రైన్స్ లో ప్రయాణానికి భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు... మెరుగైన సౌకర్యాలు ఉండటంతో ఇందులో ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారు. దీంతో ఇటీవల వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. జనవరి 22న అస్సాంలోని కామాఖ్య స్టేషన్, పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ మధ్య మొదటి వందేభారత్ స్లీపర్ ట్రైన్ పరుగుతీసింది.
అయితే దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ స్లీపర్ హైదరాబాద్ కు నడవనున్నట్లు సమాచారం. దేశ రాజధాని డిల్లీ నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వందే భారత్ స్లీపర్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు నగరాల మధ్య నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు... వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ లగ్జరీ ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది.

