- Home
- Telangana
- Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్బాగ్ బంగ్లా అసలు కథ ఇదే..!
Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్బాగ్ బంగ్లా అసలు కథ ఇదే..!
హైదరాబాద్లో ఓ బంగ్లా పేరు చెబితే చాలు చాలామంది భయంతో వణికిపోతారు. దేశంలోనే అత్యంత భయానకమైన, రహస్యమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. నగర నడిబొడ్డున గల ఈ ''దెయ్యాల కోట'' గురించి మీకు తెలుసా..?

హైదరాబాద్ లో బూత్ బంగ్లా..
హైదరాబాద్ నడిబొడ్డున గల ప్రాంతం కుందన్ బాగ్. బేగంపేట పరిధిలోని ఈ ప్రాంతంలో ఓ పురాతన బంగ్లాలో దెయ్యాలున్నాయని ఈ టెక్ జమానాలో కూడా చాలామంది నమ్ముతున్నారు అందుకే ఈ కుందన్బాగ్ బంగ్లాను దేశంలోనే అత్యంత భయానకమైన, రహస్యమైన ప్రదేశాలలో ఒకటిగా మారింది.
ఈ కుందన్ బాగ్ బంగ్లా చుట్టూ కొవ్వొత్తులు పట్టుకున్న ఆత్మలు తిరుగుతాయని… రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు కూడా చెబుతుంటారు. దీంతో దెయ్యాలున్నాయనే నమ్మకం మరింత పెరిగింది. ఇక్కడ అనేక అతీంద్రియ సంఘటనలు జరిగాయని, అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతానికి వెళ్లడానికి జనం భయపడతారు. కుందన్బాగ్ బంగ్లా కథ ఇప్పటికీ ప్రజలను వణికిస్తోంది.
కుందన్ బాగ్ బంగ్లా స్టోరీ ఇదే...
హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న కుందన్బాగ్ హౌస్ కథ కేవలం కట్టుకథ కాదు, ఇది భయంకరమైన నిజం. 2002లో ఈ కథ వెలుగులోకి వచ్చింది. రెండంతస్తుల బంగ్లాలో నివసించే ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెల వింత ప్రవర్తన ఇరుగుపొరుగు వారిని భయపెట్టడం ప్రారంభించింది.
స్థానికుల కథనం ప్రకారం… ఆ మహిళ, ఆమె కూతుళ్లు రాత్రిపూట నల్ల బట్టలు ధరించి, కొవ్వొత్తులు పట్టుకుని తమ ఇంటి బాల్కనీలో తిరిగేవారు. కొన్నిసార్లు ఇంటి బయట ఉన్న చెత్తకుండీలలో రక్తంతో నిండిన సీసాలు విసిరేస్తూ వింత శబ్దాలు చేసేవారు. దీంతో వారు చేతబడి చేస్తున్నారనే వదంతులు వ్యాపించాయి.
కుందన్ బాగ్ బంగ్లా సీక్రెట్ బైటపెట్టిన దొంగ..
ఈ కథలో అసలు మలుపు ఓ దొంగ ఆ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్లినప్పుడు వచ్చింది. ఇంట్లోకి రహస్యంగా వెళ్లిన అతను, భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తుకొచ్చాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, వారికి భయంకరమైన దృశ్యం కనిపించింది. తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెల కుళ్లిన మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి.
అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ ముగ్గురూ దాదాపు ఆరు నెలల క్రితమే చనిపోయారని తేలింది. కానీ చనిపోయిన తర్వాత కూడా చాలా నెలల పాటు ఆ మహిళలు బాల్కనీలో కొవ్వొత్తులు వెలిగించడం చూశామని ఇరుగుపొరుగు వారు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియాలో బూత్ బంగ్లా వీడియోలు...
ఇప్పటికీ ఆ కుందన్ బాగ్ బంగ్లా పాడుబడిన స్థితిలోనే ఉంది. ఇందులోంచి రాత్రిపూట కేకలు వినిపిస్తాయని, మసక కొవ్వొత్తి వెలుగు కనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. కుందన్బాగ్ ఇంటికి సంబంధించిన ఈ రహస్యం ఇప్పటికీ వీడలేదు.
అయితే ఇటీవల చాలామంది ''గోస్ట్ హంటింగ్'' పేరుతో ఈ కుందర్ బాగ్ బంగ్లా వద్ద వీడియోలు తీస్తున్నారు... గ్రాఫిక్స్ యాడ్ చేసి నిజంగానే దెయ్యాలను చూసినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్థానికులకు మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇలా భయపెట్టేలా కుందన్ బాగ్ బంగ్లా వీడియోలను పోస్ట్ చేసిన 35 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ భవనం వద్ద వీడియోలు తీసేవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వీడియోలతో కుందన్ బాగ్ బంగ్లా వార్తల్లో నిలిచింది.

