- Home
- Telangana
- ఆ ఫొటోలు అడుగుతారు, తర్వాత అసలు రూపం బయట పెడతారు.. అమ్మాయిల పేరెంట్స్కి సజ్జనార్ వార్నింగ్
ఆ ఫొటోలు అడుగుతారు, తర్వాత అసలు రూపం బయట పెడతారు.. అమ్మాయిల పేరెంట్స్కి సజ్జనార్ వార్నింగ్
Hyderabad నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సోషల్ మీడియా వినియోగంపై యువతికు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా యువతులు అపరిచితులతో ఆన్లైన్లో పరిచయాలు పెంచుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

ప్రమాదంగా మారుతోన్న స్మార్ట్ఫోన్
ప్రస్తుతం స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. కానీ ఇదే సాంకేతికత కొంతమందికి ప్రమాదకరంగా మారుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. సోషల్ మీడియా విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిన తర్వాత అపరిచితులతో ఏర్పడే పరిచయాలు పెరిగాయి. వాటి వల్ల ముఖ్యంగా యువతులు అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇటీవల తన దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వాటి గురించి తెలిసినప్పుడు చాలా బాధగా అనిపిస్తోందని అన్నారు.
నకిలీ ఖాతాలతో యువతిని వలలోకి దింపుతున్న సైబర్ కేటుగాళ్లు
సైబర్ నేరస్థులు సోషల్ మీడియాలో కొత్త పద్ధతులు ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని సజ్జనార్ తెలిపారు. అందమైన యువకులు, సినీ నటుల ఫోటోలు డీపీలుగా పెట్టి నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. ఈ నకిలీ ప్రొఫైళ్ల వెనుక ఉన్న వ్యక్తులు మాయమాటలతో నమ్మకం కలిగించి వ్యక్తిగత చాటింగ్ మొదలు పెడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు వారి మాటలకు ఆకర్షితులై వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
వ్యక్తిగత ఫోటోలు పంపగానే బ్లాక్మెయిల్ మొదలు
వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు పొందిన తర్వాత అసలు స్వరూపం బయటపడుతుందని సజ్జనార్ హెచ్చరించారు. ఆ ఫోటోలు తీసుకున్న వెంటనే ఆ అపరిచితులు బెదిరింపులకు దిగుతారు. వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తామని లేదా కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరిస్తారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇవ్వాలని, మరికొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కలవాలని ఒత్తిడి చేస్తారు. ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ బాధితులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. పరువు పోతుందన్న భయంతో కొందరు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక అడిగినంత డబ్బు కూడా ఇస్తున్నారు. మరికొందరు ఈ వేధింపులు భరించలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు… pic.twitter.com/sWbS2L4bhP— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 21, 2026
భయపడొద్దు… వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి
సైబర్ వేధింపులు ఎదురైతే భయపడకూడదని సజ్జనార్ యువతికి సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్మెయిలర్లకు లొంగిపోవడం తప్పు అని చెప్పారు. తమ సమస్యను తల్లిదండ్రులు, స్నేహితులతో పంచుకోవాలని సూచించారు. ఏ మాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. పోలీస్ శాఖ ఎప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
అలాగే ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని యువతికి స్పష్టంగా చెప్పారు.
సైబర్ నేరస్థులకు సజ్జనార్ కఠిన హెచ్చరిక
నకిలీ ప్రొఫైళ్లు, ఫేక్ నంబర్లు, VPN వంటి సాంకేతిక పద్ధతులు ఉపయోగించి పోలీసులకు దొరకమని భావించవద్దని సజ్జనార్ సైబర్ నేరస్థులను హెచ్చరించారు. ఎక్కడ దాక్కున్నా గుర్తించి పట్టుకుంటామని స్పష్టం చేశారు. చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడపాలని సూచించారు. వారు ఆన్లైన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాలపై కనీసం ఒక కంట ఉండాలని చెప్పారు.

