- Home
- Telangana
- Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో పాటు అకాల వర్షాలు, పిడుగుల బీభత్సం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలొని పలు ప్రాంతాల్లో మండే ఎండలతో పాటు వర్షాలు దంచికొడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నిప్పుల కుంపటిలా మారిన తెలుగు రాష్ట్రాలు.. రికార్డ్ బ్రేక్ ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయింది. మే నెలలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ జనాన్ని ముప్పితిప్పలు పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా ప్రతి ఊరు నిప్పుల కుంపటిలా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాల్లోని సుమారు 95 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాటాయి. రాబోయే రోజుల్లో మరో 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు.

ఏపీలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 45 నుండి 46 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లా కానుమోలులో హయ్యస్ట్గా 45.8°C రికార్డైంది.
ఇటు తెలంగాణలో కూడా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఎండతో జనం అల్లాడిపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు వేడి ఉంటోంది. మధ్యాహ్నం 1 గంట దాటిందంటే చాలు, జనం బయటకు రావడానికి భయపడుతుండటంతో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి.
ఒకవైపు ఎండలు.. ఇంకోవైపు గాలివాన బీభత్సం
ఇదిలా ఉంటే, వాతావరణంలో జరుగుతున్న విచిత్ర మార్పులు జనాలను మరింత బెంబేలెత్తిస్తున్నాయి. తీవ్రమైన ఎండల మధ్యే హఠాత్తుగా వాతావరణం మారిపోయి గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఈ అకాల వర్షాలు, పిడుగుల కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో అరగంట పాటు వీచిన తుపాను లాంటి గాలులకు వందలాది విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి.
మరో కొన్ని గంటల్లో భారీ వర్షాలు..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) రాబోయే కొద్ది గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని లేటెస్ట్ వార్నింగ్ ఇచ్చింది.
ముఖ్యంగా మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వాన పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని అంచనా వేసింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని చెప్తూ అధికారులకు, ప్రజలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ద్రోణి ప్రభావంతో వర్షాలు
చత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక వాతావరణ ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్పులు జరుగుతున్నాయి. దీని వల్ల రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, కడపతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన లైట్ టు మోడరేట్ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు.
ప్రజలు, ముఖ్యంగా రైతులు ఈ ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

