- Home
- Technology
- NISAR: నిసార్ శాటిలైట్ కోసం చేతులు కలిపిన భారత్, అమెరికా.. అసలేంటీ ప్రయోగం? ఉపయోగం ఏంటీ?
NISAR: నిసార్ శాటిలైట్ కోసం చేతులు కలిపిన భారత్, అమెరికా.. అసలేంటీ ప్రయోగం? ఉపయోగం ఏంటీ?
భారత్, అమెరికా సంయుక్తంగా నిసార్ అనే శక్తివంతమైన శాటిలైట్ను ప్రయోగించనుంది. జూలై 30న ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇంతకీ మిషన్ ప్రత్యేకత ఏంటి? ఈ ఉపగ్రహం అందించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర సృష్టించనున్న నిసార్ ప్రయోగం
భారత్-అమెరికా సంయుక్తంగా భూగోళాన్ని పరిశీలించేందుకు తొలిసారిగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. జూలై 30, 2025 సాయంత్రం 5:40 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇస్రోకి చెందిన GSLV రాకెట్ ద్వారా రాకెట్ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం తర్వాత నిసార్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది.
ఉపగ్రహం ప్రత్యేకత ఏంటంటే.?
ఈ ఉపగ్రహం 743 కి.మీ ఎత్తులో తిరుగుతూ అడవులు, పంటలు, హిమపర్వతాలు, సముద్రాలు అన్నింటినీ గమనిస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఈ ఉపగ్రహం పనిచేస్తుంది. వర్షాలు కురుస్తున్నా, వాతావరణం సహకరించకపోయినా ఈ ఉపగ్రహం డేటా సేకరిస్తూనే ఉంటుంది. NASA-ISRO రాడార్ సిస్టమ్స్ కలయికతో వాతావరణానికి సంబంధం లేకుండా స్పష్టమైన సమాచారం అందిస్తుంది.
అత్యాధునిక టెక్నాలజీ
నిసార్లో 12 మీటర్ల పొడవైన భారీ యాంటెనా ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి వెళ్లి తర్వాత పెద్ద గొడుగులా ఓపెన్ అవుతుంది. SweepSAR అనే అత్యాధునిక టెక్నాలజీతో విస్తృత ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. పాత ఉపగ్రహాలు చేయలేని విధంగా విస్తారమైన ప్రాంతాలను స్పష్టంగా చిత్రీకరించగలదు. ISRO రూపకల్పన చేసిన ఉపగ్రహ ప్లాట్ఫారమ్పై NASA టెక్నాలజీని అమర్చడం ఈ మిషన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
రెండు రాడార్ల శక్తి
ఈ ఉపగ్రహంలో రెండు రకాల రాడార్లు ఉంటాయి. వీటిలో మొదటిది నాసా రాడర్. ఇది నేల కింద, మంచు కింద, అడవుల లోపల మార్పులను గుర్తిస్తుంది. మట్టిలో తేమ, భూస్కలనం వంటి వాటిని ట్రాక్ చేస్తుంది. ఇక నాసా రాడర్ విషయానికొస్తే.. పంటలు, భూభాగ మార్పులు, మంచు కరుగుదల వంటి ఉపరితల మార్పులను గుర్తిస్తుంది. ఇలా ఈ రెండూ కలిసి భూమి పరిస్థితులపై పూర్తి స్థాయి సమాచారం ఇస్తాయి.
వీటితో ప్రపంచానికి ఏంటీ ఉపయోగం.?
నిసార్ అందించే డేటా కేవలం శాస్త్రవేత్తలకే కాదు, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. వరదలు, భూకంపాలు, వాతావరణంలో మార్పులు, అడవి అగ్నిప్రమాదాలు వంటి విపత్తులను ముందుగానే అంచనా వేయవచ్చు. రైతులకు పంటల పెరుగుదల, నీటి వినియోగం వంటి వివరాలు అందుతాయి.
వాతావరణ మార్పులు, హిమపర్వతాల కరుగుదల, అడవుల ఆరోగ్యంపై విలువైన సమాచారం అందుతుంది. ఇది భారత్ అంతరిక్ష ప్రయాణంలో గొప్ప అడుగు మాత్రమే కాకుండా, ప్రపంచ రక్షణకు రెండు దేశాలు కలిసి చేస్తున్న అద్భుత కృషిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.