ఇటీవ‌ల జ‌రుగుతోన్న విమాన ప్ర‌మాదాలు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎయిర్ ఇండియా ప్ర‌మాదం ఇప్ప‌టికీ వెంటాడుతూనే ఉంది. కాగా ర‌ష్యాలో 50 మందితో వెళ్తున్న ఓ విమానం కుప్పకూలిందన్న వార్త ఉలిక్కిపడేలా చేసింది.  

ప్రయాణికులతో పాటు అదృశ్యం

అముర్‌ ప్రాంతంలో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న టిండా పట్టణం వైపు ఈ విమానం ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా సంబంధాలు తెగిపోయాయి. సుమారు 50 మంది ప్రయాణికులు, సిబ్బంది ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. ఉదయం అదృశ్యమైన ఈ విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కూలిన ప్రదేశం గుర్తింపు

రెస్క్యూ బృందాలు శోధన ప్రారంభించి కొన్ని గంటల్లోనే విమానం కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించాయి. టైండా విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో శిధిలాలను కనుగొన్నారు. విమానం ల్యాండింగ్‌కు కొద్ది క్షణాల ముందే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

View post on Instagram

మృతుల సంఖ్యపై ఆందోళన

ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో ఉన్న వారంతా మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శిధిలాల నుంచి శరీరాలను వెలికితీసే పనిలో రెస్క్యూ బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.