పండ్లు, కూరగాయలపై రసాయనాలు చల్లారని అనుమానంగా ఉందా.? ఈ ఏఐ డివైజ్ చెప్పేస్తుంది
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఊహకందని పనులు కూడా సాకారమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ కాన్పూర్కు చెందిన పరిశోధకులు ఓ అద్భుతాన్ని సాకారం చేశారు.

90 సెకండ్లలో పండ్లు, కూరగాయల పరీక్ష
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పటివరకు చదువు, ఆరోగ్యం, పరిశ్రమ, వ్యాపారం వంటి రంగాల్లో ఉపయోగంలో ఉంది. ఇప్పుడు ఇది మన వంటగదికి కూడా చేరింది. కొత్తగా రూపొందించిన ఒక పోర్టబుల్ డివైస్ కేవలం 90 సెకండ్లలో పండ్లు, కూరగాయల నాణ్యతను పరీక్షించగలదు. పండు లేదా కూరగాయలోని చిన్న ముక్కను స్కాన్ చేస్తే చాలు. అందులో ఉన్న పెస్టిసైడ్ అవశేషాలు, ఏ రకమైన రసాయనాలు ఉన్నాయో, అవి ఆరోగ్యంపై కలిగించే ప్రభావం ఏమిటో వెంటనే తెలియజేస్తుంది. ఈ పరీక్షలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం. ఒక్కసారి పరీక్ష ఖర్చు కేవలం 10 నుంచి 15 పైసలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అందువల్ల సాధారణ ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
ఐఐటీ కాన్పూర్ స్టార్టప్ అభివృద్ధి చేసిన సాంకేతికత
ఈ వినూత్న సాంకేతికతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్లో ఇన్క్యుబేట్ అయిన ‘స్కాన్ఎక్స్’ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఈ డివైస్లో ఎన్ఐఆర్ (Near Infrared), ఎమ్ఐఆర్ (Mid Infrared) స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీలను ఏఐ, మెషిన్ లెర్నింగ్తో కలిపి ఉపయోగించారు. 750 నుంచి 2500 నానోమీటర్ల వరకు ఉన్న సమీప ఇన్ఫ్రారెడ్ కాంతి పండ్లు, కూరగాయల లోపలి భాగాన్ని స్కాన్ చేస్తుంది. 2.5 నుంచి 10 మైక్రోమీటర్ల మధ్య ఇన్ఫ్రారెడ్ తరంగాలు హానికర గ్యాస్లు, పెస్టిసైడ్ అవశేషాలను గుర్తిస్తాయి. ఈ రెండు విధానాల కలయిక వల్ల వేగంగా, కచ్చితంగా, నష్టం లేకుండా పరీక్ష చేయడం సాధ్యమవుతోంది.
2026 చివర్లో మార్కెట్లోకి
స్టార్టప్ ఇప్పటికే ఈ డివైస్కు పేటెంట్ దాఖలు చేసింది. 2026 చివర్లో మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరికరాన్ని రైతులతో పాటు సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ప్రారంభ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఒక డివైస్ కనీసం ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది. అవసరమైతే సర్వీస్ చేయించుకుని మళ్లీ ఉపయోగించవచ్చు. ఇందులో మార్చుకునే బ్యాటరీ సౌకర్యం కూడా ఉంటుంది.
ఈ టెక్నాలజీ ఉపయోగం ఏంటి.?
ఈ రోజుల్లో పండ్లు, కూరగాయల్లో అధికంగా పెస్టిసైడ్లు వాడుతున్నారు. అయితే ప్రజలు ఆరోగ్యానికి మంచిదని పండ్లను తెగ తింటున్నారు. కానీ అవి ఎంత సురక్షితమో తెలుసుకునే అవకాశం ఉండదు. అధికంగా వాడే రసాయనాలు దీర్ఘకాలంలో క్యాన్సర్, నరాల సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా ల్యాబ్ పరీక్షలు ఖరీదైనవి. అలాగే సమయం కూడా ఎక్కువ పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తరచుగా పరీక్ష చేయించుకోవడం సాధ్యం కాదు. ఈ డివైస్ ఇంటి దగ్గరే వేగంగా పరీక్ష చేయగలదు. ఇది ఆహార భద్రతలో పెద్ద మార్పు తీసుకురాగలదు.
రైతులకు, వినియోగదారులకు లాభాలు
ఈ టెక్నాలజీ ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. వారు తమ ఉత్పత్తులు నిజంగా రసాయన రహితమని సులభంగా నిరూపించగలరు. దీనివల్ల మార్కెట్లో మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. వినియోగదారులు కొనుగోలు చేసే ముందు పరీక్షించి, భద్రంగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవచ్చు. ఇలా కేవలం 90 సెకండ్లలో, 15 పైసల ఖర్చుతో చేసే ఈ ఏఐ పరీక్ష భవిష్యత్తులో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు కానుంది.

