- Home
- National
- Weekly Roundup: ఓవైపు వర్షాలు, మరోవైపు పొలిటికల్ హీట్.. ఈ వారం జరిగిన కీలక పరిణామాలు
Weekly Roundup: ఓవైపు వర్షాలు, మరోవైపు పొలిటికల్ హీట్.. ఈ వారం జరిగిన కీలక పరిణామాలు
Weekly Roundup: ఈ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. అలాగే పొలిటికల్గా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోకల్ టూ గ్లోబల్ ఈ వారంలో జరిగిన కొన్ని కీలక అంశాలపై ఓ లుక్కేయండి.

ఏపీని కుదిపేసిన బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్
ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్, బాలకృష్ణల మధ్య జరిగిన చర్చ రాష్ట్ర రాజకీయాలను కుదేసింది. గురువారం సభలో కామినేని మాట్లాడుతూ.. జగన్ హయాంలో సినిమా హీరోలను అవమానపరిచేలా వ్యవహరించారని, చిరంజీవి గట్టిగా అడగడంతోనే జగన్ కలిశారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బాలకృష్ణ సీరియస్ అవుతూ.. ఇందులో ఏమాత్రం నిజం లేదని, ఎవరూ గట్టిగా అడగలేదంటూ కాస్త సీరియస్గా స్పందించారు. దీంతో దీనిపై చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చిరు.. టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, దర్శకుల అభ్యర్థనతో తానే అప్పట్లో మంత్రి పేర్ని నాని సహకారంతో సీఎం జగన్ను కలిసినట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ చొరవ వల్ల పరిశ్రమకు కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.
మళ్లీ విరుచుకుపడ్డ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ సుంకాలు ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఔషధాలపై 100%, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ ఫిట్టింగ్స్పై 50%, ఫర్నిచర్పై 30%, ట్రక్కులపై 25% పన్ను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. దేశీయ తయారీ పెంచి, బడ్జెట్ లోటు తగ్గించడమే లక్ష్యమని అన్నారు. అయితే భారత్ నుంచి వచ్చే ఔషధాలపై కూడా ఇది ప్రభావం చూపనుంది. ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత్పై 50% సుంకం విధించిన ట్రంప్ తాజా నిర్ణయాలు గృహనిర్మాణ ఖర్చులు, ధరల భారాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.
ఇండియన్ ఆర్మీ మరో అద్భుతం
భారత రక్షణ వ్యవస్థ మరో సంచలన జయాన్ని సాధించింది. అగ్ని-ప్రైమ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది. గురువారం రోజు ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి రైల్వే ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా డీఆర్డీవో, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, భారత సైన్యం సంయుక్తంగా క్షిపణిని పరీక్షించింది. సుమారు 2,000 కిలోమీటర్ల పరిధి గల ఈ అడ్వాన్స్డ్ క్షిపణిని ప్రయోగించి విజయాన్ని సాధించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తెలంగాణలో వర్షాలు, స్థానిక ఎన్నికలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సీఎస్ రామకృష్ణారావు సహా పలు శాఖల అధికారి లు పాల్గొనగా, సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే అధికారులకు సన్నాహాలపై దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తుండగా వారంతానికి మరింత పెరిగాయి. కుండపోతు వర్షాలతో హైదరాబాద్లోని మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్లోకి నీరు చేరాయి. వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ అలర్ట్ చేశారు.
హై ఓల్టేజ్ ఫైనల్ మ్యాచ్
ఆసియా కప్ 2025లో టీమిండియా దుమ్ము రేపింది. అన్ని మ్యాచుల్లో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా ఆసియా కప్ ఫైనల్లో ఆదివారం భారత్–పాకిస్థాన్ పోరు జరగనుంది. అయితే టీమ్ఇండియాకు ముందు గాయాల ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకతో చివరి మ్యాచ్లో అద్భుతంగా ఆడిన అభిషేక్ శర్మ ఫీల్డింగ్కు రాలేదు, హార్దిక్ పాండ్య ఒక్క ఓవర్ వేసి ఆగిపోయాడు. దీంతో వీరిద్దరి ఫిట్నెస్పై సందేహాలు మొదలయ్యాయి. కానీ పెద్ద సమస్య ఏమీ లేదని, శనివారానికి వారి స్థితి స్పష్టమవుతుందని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపారు. ఈ మ్యాచ్ పై అందరి దృష్టి పడింది.