Union Budget: కొత్త బడ్జెట్తో దేశంలో ఏం మారనుంది.? 2026 బడ్జెట్ హైలైట్స్ ఇవే
Union Budget: దేశ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ థీమ్తో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లోని హైలైట్స్ ఇవే..

బయోఫార్మా మ్యాన్యుఫ్యాక్చరింగ్కి పెద్ద పీట
కేంద్ర బడ్జెట్లో బయోఫార్మా మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగానే ఈ రంగానికి ఏకంగా రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఐదేళ్లకు గాను ఈ మొత్తాన్ని కేటాయించారు. దీంతో దేశంలో పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అదే విధంగా ఫార్మా రంగంలో దేశం మరింత పురోగమనించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా..
ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో మైనింగ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు, రెండు హైటెక్ టెక్నాలజీ హబ్స్, మూడు డెడికేటెడ్ కెమికల్ పార్కుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సెమీకండక్టర్ మిషన్కు రూ.40 వేల కోట్లు, కంటైనర్ తయారీ రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. జౌళి రంగానికి ప్రోత్సాహం కల్పిస్తూ మెగా టెక్స్టైల్ పార్కులు, ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు, SME రంగానికి రూ.10 వేల కోట్లు, మైక్రో సెక్టార్కు రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ ద్వారా సమగ్ర ఆర్థిక బలోపేతమే లక్ష్యమని కేంద్రం స్పష్టంచేసింది.
సెమీకండక్టర్లకు ప్రాధాన్యం
బడ్జెట్ 2026లో సెమీకండక్టర్ రంగానికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇచ్చింది. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశాన్ని ఎలక్ట్రానిక్స్, చిప్ తయారీ హబ్గా తీర్చిదిద్దడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ఈ పథక ప్రధాన లక్ష్యంగా తెలిపారు. సెమీకండక్టర్ ఫ్యాబ్లు, డిస్ప్లే యూనిట్లు, చిప్ డిజైన్ రంగాలకు ప్రోత్సాహం కల్పించనున్నారు.

