- Home
- National
- Tamil Nadu Assembly Election 2026: మినీ కురుక్షేత్రం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలివే !
Tamil Nadu Assembly Election 2026: మినీ కురుక్షేత్రం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలివే !
Assembly Election Schedule 2026 : దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖాళీగా ఉన్న ఉప ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్నికల సమరం
భారత ప్రజాస్వామ్య పండుగకు సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలతో కలిసి ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
5 రాష్ట్రాల అసెంబ్లీ సమరం.. ఉప ఎన్నికలకూ ఈసీ గ్రీన్ సిగ్నల్
భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పండుగకు ముహూర్తం ఖరారైంది. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
పశ్చిమ బెంగాల్: రెండు అంచెల సమరం
అత్యధికంగా 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో భద్రతా కారణాల దృష్ట్యా రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
• మొదటి దశ: ఏప్రిల్ 23 (152 స్థానాలు)
• రెండవ దశ: ఏప్రిల్ 29 (142 స్థానాలు)
మార్చి 30న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఏప్రిల్ 6న నామినేషన్ల గడువు ముగియనుంది.
కేరళ, తమిళనాడు, అస్సాం: ఒకే విడతలో పోలింగ్
తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది.
• కేరళ, అస్సాం, పుదుచ్చేరి: ఏప్రిల్ 9న పోలింగ్.
• తమిళనాడు: ఏప్రిల్ 23న పోలింగ్.
ఈ రాష్ట్రాల్లో మార్చి 16 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది.
బై-ఎలక్షన్ షెడ్యూల్: ఖాళీగా ఉన్న చోట ఉప ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
• ఉప ఎన్నికల తేదీ: ఏప్రిల్ 9 (గురువారం).
• నోటిఫికేషన్: మార్చి 16.
• నామినేషన్ల గడువు: మార్చి 23.
• స్క్రూటినీ: మార్చి 24.
• ఉపసంహరణ: మార్చి 26.
ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా మే 4నే వెలువడనున్నాయి.
17.4 కోట్ల ఓటర్లు.. పక్కా భద్రత
మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఈ భారీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. సుమారు 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, 25 లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు.
మే 4న దేశవ్యాప్త ఉత్కంఠ.. అప్పుడే ఫలితాలు!
అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4 (సోమవారం) నాడు జరుగుతుంది. మే 6వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని ఈసీ గడువు విధించింది. ఈ షెడ్యూల్ విడుదలతో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.

