Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్... ఎలా అమలుచేస్తారో తెలుసా..?
Social Media Ban : పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడం బాగానే ఉంది... కానీ దీన్ని ఎలా అమలుచేస్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఏ వయసువారు సోషల్ మీడియాను వాడుతున్నారో ఎలా గుర్తిస్తారు..?

సోషల్ మీడియా బ్యాన్...
Social Media Ban : భారతదేశంలో సోషల్ మీడియాపై ఏమాత్రం నియంత్రణ లేదు... అందుకే దీన్ని చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ప్రతిఒక్కరు ఉపయోగిస్తున్నారు. మరీముఖ్యంగా యువతీయువకుల్లో సోషల్ మీడియా వాడకం మరీ ఎక్కువ. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ కు అలవాటుపడిపోయి కొందరు… సోషల్ మీడియా మాయలో మరికొందరు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు చెడ్డదారి పడుతున్నారు. అందుకే చిన్నారుల బంగారు భవిష్యత్ ను కాపాడేందుకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా చాలారోజులుగా వినిపిస్తోంది... ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం ఈ దిశగా ఓ ముందడుగు వేసింది.
చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై నిషేదం..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా కీలకమైన బడ్జెట్ సమయంలో ఈ ప్రకటన చేశారు. దీన్నిబట్టి స్కూల్ వయసు చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా విధించిన ఈ నిషేధాన్ని పకడ్బందీగా అమలుచేస్తుందని స్పష్టమవుతోంది.
పెరిగిపోతున్న మొబైల్ వాడకం వల్ల పిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు పడుతున్నాయని, వాటిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియా వాడకం పిల్లలపై చాలా సీరియస్ ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఫోన్లు కొనిస్తే, పిల్లలు వాటిని సోషల్ మీడియా కోసం వాడుతున్నారని అన్నారు. సొంతంగా లాగిన్ ఐడీలు క్రియేట్ చేసుకుని మరీ వాడుతున్నారన్నారు. అయితే ఇకపై 16 ఏళ్లలోపు పిల్లలు లాగిన్ అయ్యే ముందు తమ వయసును తప్పనిసరిగా ధ్రువీకరించాల్సి ఉంటుందని... ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు, నిపుణుల హర్షం
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తోంది. ఆన్లైన్ గేమ్స్, షార్ట్ వీడియోల పిచ్చితో పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని చాలామంది ఆవేదన చెందారు… ఇప్పుడు ప్రభుత్వ చర్యతో వాళ్లంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. విద్యా నిపుణులు, సైకియాట్రిస్టులు కూడా ప్రభుత్వ ధైర్యమైన నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంచడానికి సాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
సాంకేతిక సవాళ్లు...
అయితే ఈ నిషేధాన్ని టెక్నికల్గా ఎలా అమలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. వయసు ధ్రువీకరణ (Age Verification) ప్రక్రియను తప్పనిసరి చేయాలని సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై భారీ జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను ఎలా తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియా తరహాలోనే నిషేధం అమలుచేస్తారా..?
ఆంధ్ర ప్రదేశ్, గోవా రాష్ట్రాలు కూడా చిన్నారులను సోషల్ మీడియా నుండి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి... ఈ దిశగా కీలక చర్యలకు సిద్దం అవుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఏకంగా అసెంబ్లీలోనే చిన్నారులు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చిన్నారులు సోషల్ మీడియా వాడటంపై నిషేధం ఉంది... ఇక్కడ చాలా పకడ్బందీగా దీన్ని అమలుచేస్తున్నారు. నిషేధాన్ని ఉళ్లంఘించి చిన్నారులు సోషల్ మీడియా వాడినట్లు నిర్దారణ అయితే ఆ పిల్లలు, వారి పేరెంట్స్ కు శిక్షలుండవు... సదరు సంస్థపై భారీ ఫైన్లు, ఆంక్షలు ఉంటాయి. అందువల్లే కంపెనీలు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు చిన్నారులను దూరం ఉంచేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇలా ఆస్ట్రేలియా తరహాలోనే కర్ణాటక కూడా సోషల్ మీడియా నిషేధాన్ని అమలుచేసే అవకాశాలున్నాయి.

