- Home
- National
- Viral News: కర్ణాటక గుహలో రష్యన్ మహిళ రహస్య జీవనం.. అసలు అక్కడ ఏం చేస్తున్నారు?
Viral News: కర్ణాటక గుహలో రష్యన్ మహిళ రహస్య జీవనం.. అసలు అక్కడ ఏం చేస్తున్నారు?
Russian woman in cave: కర్ణాటకలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రష్యాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే..

గుహలో నివాసం ఉంటున్న తల్లి, పిల్లలు
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని రామతీర్థ కొండల్లో ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి గుహలో నివసిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. నినా క్యూటినా (40), ఆమె కుమార్తెలు ప్రేమ (6), ఆమ (4) గత రెండు వారాలుగా దట్టమైన అటవీ ప్రాంతంలోని గుహలో నివసిస్తూ మెడిటేషన్, పూజలు చేస్తున్నారు.
ఎలా తెలిసింది.?
గోకర్ణ పోలీసుల టూరిజం పర్యవేక్షణ పర్యటనలో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ SR నేతృత్వంలోని బృందం గుహ బయట ఆరబెట్టిన దుస్తులు గమనించి విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే గుహ లోపలికి వెళ్లి చూడగా తల్లీకూతుళ్లను గుహలో గుర్తించారు. వారు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అక్కడ నివసించడం ప్రమాదకరమని గుర్తించి పోలీసులు వారిని కొండ కిందికి తీసుకొచ్చి బంకికొడ్ల గ్రామంలోని ఓ ఆశ్రమానికి తరలించారు.
భారత్కి ఎందుకొచ్చారు.?
నినా క్యూటినా భారతదేశానికి ఒక బిజినెస్ వీసాతో వచ్చారు. హిందూ తత్వశాస్త్రం పట్ల ఆకర్షణతో ఆమె గోకర్ణకు చేరుకున్నారు. అటవీ గుహలో రుద్రుని విగ్రహం ఏర్పాటు చేసి తపస్సు చేయడం, ధ్యానం చేయడం వంటి ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరిస్తున్నారు.
బిజినెస్ వీసాతో
మొదట నినా సరైన పాస్పోర్ట్ లేదా వీసా చూపించలేదు. అయితే అనంతరం పోలీస్శాఖ, అటవీశాఖ కలిసి సెర్చ్ చేయగా, పాస్పోర్ట్, వీసా డాక్యుమెంట్లు కనిపించాయి. దర్యాప్తులో ఆమె 2016 అక్టోబర్ 18న బిజినెస్ వీసాతో భారత్కు వచ్చారని, అది 2017 ఏప్రిల్ 17న ముగిసిందని, 2018లో నెపాల్ వెళ్లి మళ్లీ సెప్టెంబర్ 8న తిరిగి భారత్కు వచ్చారని తెలుస్తోంది.
రష్యన్ ఎంబసీతో సంప్రదింపులు
భద్రతా దృష్ట్యా ఆమెను, ఇద్దరు కుమార్తెలను కర్ణాటక ప్రభుత్వ మహిళాశ్రయ కేంద్రానికి (కార్వార్) తరలించారు. వీసా ఉల్లంఘన కారణంగా ఎఫ్ఆర్ఆర్ఓ బెంగళూరు శాఖ దర్యాప్తు ప్రారంభించింది. స్థానిక ఎన్జీవో సహాయంతో రష్యన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపారు. తల్లి, పిల్లలను సురక్షితంగా రష్యాకు పంపే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.