- Home
- Entertainment
- Kota Srinivasa Rao: కోట శ్రీనివాస్ మహా మొండోడబ్బా.. ఈగోతోనే ఎమ్మెల్యే అయ్యాడు. అసలేం జరిగిందంటే..
Kota Srinivasa Rao: కోట శ్రీనివాస్ మహా మొండోడబ్బా.. ఈగోతోనే ఎమ్మెల్యే అయ్యాడు. అసలేం జరిగిందంటే..
తెలుగు సినీ పరిశ్రమ అద్భుత నటుడిని కోల్పోయింది. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాదు, నిజ జీవితంలోనూ ప్రజలకు సేవచేసిన ఓ గొప్ప వ్యక్తి కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.

నాటక రంగంపై ఇష్టంతో
కోట శ్రీనివాసరావు తెలుగు సినీ రంగంలో మలుపు తిప్పిన నటులలో ఒకరు. 1943లో కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని నాగమల్లు తోట గ్రామంలో జన్మించిన కోటా, మొదటిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవితం ప్రారంభించారు. అయితే, నాటక రంగంపై మక్కువతో సినీ రంగంలో అడుగుపెట్టారు.
1978లో విడుదలైన ప్రాణం ఖరీదు’ అనే సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆఖరి పోరాటం, గోవింద గోవింద, గణేష్, మనీ, మదన వంటి చిత్రాల్లో విలన్, హాస్యపాత్రలు, ఎమోషనల్ పాత్రలతో తనదైన ముద్ర వేశారు.
700కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు అనేక అవార్డులు, ప్రశంసలు దక్కాయి. 1991లో వచ్చిన గణేష్ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.
రాజకీయాల్లోనూ
కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, కోటా ప్రజాసేవ వైపుకూ అడుగులు వేశారు. 1999 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశారు.
రాజకీయాల్లో కోటా శైలీ విభిన్నంగా ఉండేది. అసెంబ్లీలో హుందాగా వ్యవహరించడమే కాకుండా, సహచరులెవరైనా హాస్యంగా మాట్లాడితే వెంటనే స్పందించేవారు.
ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నారు. అయితే 2004 తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.
కోట రాజకీయ రంగ ప్రవేశానికి కారణం అదేనా.?
కోటా రాజకీయాల్లోకి రావడానికి ఓ సరదా కారణమే ప్రేరణగా మారిందని బాబు మోహన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ విషయమై బాబు మోహన్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గన్మెన్లతో షూటింగ్కు వెళితే, అది చూసి కోటా అసూయ పడేవాడన్నారు.
ఒక రకంగా తనకు కూడా గన్మెన్లు ఉండాలన్న ఉద్దేశంతోనే కోటా ఎమ్మెల్యేగా పోటీ చేసి, గెలిచారని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
అసెంబ్లీలో కూడా
అంతేకాదు, అసెంబ్లీలో సీట్ల విషయంలో కూడా కోటా సరదాగా ప్రవర్తించేవారని గుర్తుచేశారు. “నేను మంత్రి అయ్యాక ముందు వరుసలో కూర్చోవడం చూసి కోటా హాస్యంగా స్పందించేవారు.
‘నీకు మంత్రి ఉన్నంత మాత్రానా ముందు వరుసలో కూర్చుంటావా.? నా పక్కన వచ్చి కూర్చోవోయ్” అని సరదాగా అనేవారని బాబు మోహన్ తన మనసులోని మాటను పంచుకున్నారు.
ఇలాంటి సంఘటనలు కోటా, బాబు మోహన్ల మధ్య ఉన్న సంబంధానికి అద్దం పడుతోందని చెప్పడంలో సందేహం లేదు.
బీజేపీతో సంబంధం
కోట శ్రీనివాస్ రావు బీజేపీ పార్టీలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయంతో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సైతం కోట మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అలాగే ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కోట మరణంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు అయిన కోట శ్రీనివాస్ మరణించారు అన్న వార్త తనను ఎంతో కలిచి వేసిందన్నారు.
సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ కోట శ్రీనివాస్ తనదైన ముద్ర వేశారు. ప్రజలకు ఎంతో దగ్గరైన వ్యక్తి ఆయన. విజయవాడ ప్రజలు ఆయన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని చెప్పుకొచ్చారు.
పద్మశ్రీ అవార్డు
కోటా శ్రీనివాసరావు సినీ, రాజకీయ రంగాల్లో సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇది ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనం. నటుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన జీవితం ఎంతో మందికి ప్రేరణ.
ఆయన మృతి తెలుగు ప్రజలకు, సినీ అభిమానులకు తీరని లోటు అనడంలో సందేహం లేదు. తెలుగు సంస్కృతి, కళలకు ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.