Santal Conference : బెంగాల్లో రాష్ట్రపతికి అవమానం? మోదీ వర్సెస్ మమత.. అసలేం జరిగింది?
Santal Conference : పశ్చిమ బెంగాలం లొ అంతర్జాతీయ సంతాలీ సదస్సులో ప్రోటోకాల్ ఉల్లంఘనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తి చేశారు. దీని తర్వాత సీఎం మమతా బెనర్జీ వైఖరిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరో పొలిటికల్ రచ్చ మొదలైంది.

పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పర్యటన చుట్టూ ముదురుతున్న వివాదం
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ సంతాలీ సదస్సు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గిరిజన సంస్కృతిని ఉత్సవంగా జరుపుకోవాల్సిన ఈ సందర్భం.. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
రాష్ట్రపతి ఆవేదన.. ప్లేస్ మార్పుపై అసహనం
ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ఈ ప్లేస్ ఎంపిక, ఏర్పాట్లపై తన అసంతృప్తిని సూటిగా వ్యక్తం చేశారు. సంతాలీ కమ్యూనిటీకి చెందిన అనేకమంది సభ్యులు తమ సొంత సంస్కృతిని ప్రతిబింబించే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. డార్జిలింగ్ జిల్లాలోని బిధాన్నగర్ నుండి సిలిగురి శివార్లలోని గోస్సైన్పూర్కు కార్యక్రమాన్ని మార్చడం వల్ల ప్రజలు రావడం కష్టమైందని ఆమె పేర్కొన్నారు. "ఇక్కడ విశాలమైన స్థలాలు ఉన్నాయి, దాదాపు ఐదు లక్షల మంది సులభంగా తరలిరావచ్చు. కానీ ఈ ప్లేస్ ఎంపిక వల్ల చాలా మంది రాలేకపోయారని తెలిసి నాకు బాధ కలిగింది" అని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ ఫైర్.. ఇది అవమానకరం
రాష్ట్రపతి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో స్పందించిన ఆయన, ఈ ఘటనను అవమానకరం, మునుపెన్నడూ లేనిది అని అభివర్ణించారు. ప్రజాస్వామ్యం, గిరిజన సాధికారతను నమ్మే ప్రతి ఒక్కరూ ఈ ఘటనతో కలత చెందారని ఆయన అన్నారు. స్వయంగా గిరిజన సమాజం నుండి వచ్చిన రాష్ట్రపతి పట్ల బెంగాల్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు రాజ్యాంగబద్ధమైన పదవిని గౌరవించకపోవడమేనని మోదీ విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన రాష్ట్రపతి కార్యాలయాన్ని తక్కువ చేసి చూపడం సరికాదని ఆయన హితవు పలికారు.
ప్రోటోకాల్ రగడ.. సీఎం మమత గైర్హాజరు
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, ఏ ఒక్క సీనియర్ మంత్రి కానీ హాజరుకాకపోవడం వివాదాన్ని మరింత రాజేసింది. సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి లేదా సీనియర్ మంత్రులు స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే, విమానాశ్రయంలో కేవలం సిలిగురి మేయర్ గౌతమ్ దేబ్ మాత్రమే రాష్ట్రపతికి స్వాగతం పలికారు. దీనిపై రాష్ట్రపతి స్పందిస్తూ, "రాష్ట్రపతి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు రావాలి. నేను బెంగాల్ బిడ్డను, మమతా బెనర్జీ నా చెల్లెలు వంటివారు. ఆమె నాపై ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియదు" అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీ కౌంటర్
ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. రాష్ట్రపతి సెక్రటేరియట్ పంపిన జాబితా ప్రకారమే స్వాగత, వీడ్కోలు ఏర్పాట్లు జరిగాయని ఆమె స్పష్టం చేశారు. సిలిగురి మేయర్, డార్జిలింగ్ జిల్లా మెజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతిని రిసీవ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. సదస్సు నిర్వాహకుల వైఫల్యాన్ని జిల్లా యంత్రాంగంపై నెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడని బీజేపీ, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే ఈ అంశాన్ని పెద్దది చేస్తోందని మమత ఆరోపించారు.
కేంద్రం జోక్యం.. సమగ్ర రిపోర్టులు ఇవ్వండి
ఈ ఉదంతంపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేస్తూ, ఆదివారం సాయంత్రం 5 గంటల లోపు సమగ్ర రిపోర్టులు సమర్పించాలని ఆదేశించారు. ప్లేస్ మార్పు, ప్రోటోకాల్ ఉల్లంఘన, ప్రయాణ మార్గంలో భద్రతా లోపాలు, ముఖ్యమంత్రి, డీజీపీ వంటి ఉన్నతాధికారులు గైర్హాజరు కావడానికి గల కారణాలను కేంద్రం ప్రశ్నించింది. జిల్లా యంత్రాంగంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా వివరించాలని కోరింది.

