- Home
- International
- Israel Iran War : 50 ఫైటర్ జెట్స్.. 100 బాంబులు.. ఇరాన్ సుప్రీం లీడర్ బంకర్ విధ్వంసం వీడియో వైరల్
Israel Iran War : 50 ఫైటర్ జెట్స్.. 100 బాంబులు.. ఇరాన్ సుప్రీం లీడర్ బంకర్ విధ్వంసం వీడియో వైరల్
Israel Iran War : టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి చెందిన అత్యంత సురక్షితమైన భూగర్భ బంకర్ను 50 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం (IDF) విడుదల చేసింది.

టెహ్రాన్ నడిబొడ్డున ఇజ్రాయెల్ విధ్వంసం
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇరాన్ పాలక యంత్రాంగం నివాస సముదాయం కింద ఉన్న అత్యంత పటిష్టమైన భూగర్భ సైనిక కమాండ్ సెంటర్ను ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) నేలమట్టం చేసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి చెందిన ఈ బంకర్పై దాడి చేసేందుకు సుమారు 50 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) శుక్రవారం ప్రకటించింది. ఈ ఆపరేషన్కు సంబంధించిన వీడియో దృశ్యాలను ఐడీఎఫ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న దాడుల్లో భాగంగా ఈ భూగర్భ కేంద్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఆపరేషన్ రోర్ ఆఫ్ ది హారియర్ వివరాలు ఇవే
ఇరాన్ తన రక్షణ కోసం ఏళ్ల తరబడి శ్రమించి నిర్మించిన ఈ భూగర్భ కాంప్లెక్స్, టెహ్రాన్ నడిబొడ్డున పలు వీధుల మేర విస్తరించి ఉందని ఐడీఎఫ్ వెల్లడించింది. అత్యవసర సమయాల్లో సుప్రీం లీడర్ యుద్ధ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు దీనిని నిర్మించారు. అయితే, ఆపరేషన్ రోర్ ఆఫ్ ది హారియర్ (Roar of the Harrier) లో భాగంగా, ఖమేనీ దీనిని వినియోగించుకోకముందే ఇజ్రాయెల్ దళాలు దీనిని ధ్వంసం చేశాయి. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఖమేనీ మరణించిన తర్వాత కూడా, ఈ బంకర్ను ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి అధికారులు తమ స్థావరంగా వాడుకుంటున్నారు. నిఘా విభాగం అందించిన ఖచ్చితమైన సమాచారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు.
#WATCH | Israel Defense Forces releases a video of the strike on the underground bunker of Iran's Supreme Leader Ayatollah Ali Khamenei
"50 Israeli Air Force fighter jets dismantled Ali Khamenei’s underground military bunker beneath the Iranian regime’s leadership compound in… pic.twitter.com/kGdCOsx3Z7— ANI (@ANI) March 6, 2026
ఖమేనీ మరణం.. యుద్ధంలో కీలక మలుపు
అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి సైనిక చర్య ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లో భాగంగా ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో 87 ఏళ్ల అలీ ఖమేనీ మరణించారు. కేవలం 60 సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఇరాన్ సాయుధ దళాల చీఫ్ అబ్దుల్ రహీమ్ మౌసవి సహా మరో 40 మంది కీలక నేతలు హతమయ్యారు. ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలుత ప్రకటించగా, అనంతరం ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఫోటోలను కూడా అధికారులు చూపించినట్లు సమాచారం. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు... ప్రతీకార దాడులు వార్
ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలైన కతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, సౌదీ అరేబియాలోని అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కువైట్లోని అమెరికా బేస్పై జరిగిన డ్రోన్ దాడిలో నలుగురు అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది. మరోవైపు, కతార్లోని అల్-ఉదైద్ ఎయిర్ బేస్పై జరిగిన డ్రోన్ దాడిని కతార్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుంది. ఇరాన్లోని మినాబ్లో ఒక పాఠశాల పైన జరిగిన దాడిలో 160 మంది మరణించగా, దానికి అమెరికా దళాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
కొనసాగుతున్న వార్.. బాంబుల వర్షం
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏడవ రోజుకు చేరుకుంది. టెహ్రాన్ ఆకాశంలో నిరంతరం పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ రాజధానిలో ఇంటర్నెట్ సేవలు 1 శాతానికి పడిపోవడంతో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ, "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇప్పుడే మొదలైందని, రాబోయే రోజుల్లో ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధిస్తామని" ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ పాలక యంత్రాంగం కూడా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై చరిత్రలోనే అత్యంత విధ్వంసకర దాడికి సిద్ధమవుతున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

