Iran Israel War లోకి ఇండియా ఇండైరెక్ట్ ఎంట్రీ..? ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్..?
Israel Iran War : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోపం తెప్పించేలా భారత్ వ్యవహరిస్తోందా..? అంటే అవును అనేలాగే కేంద్రం చర్యలున్నాయి. మరి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంలో భారత్ ఎటువైపు..?

ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా యుద్దంలో భారత్ ఎటువైపు?
Iran Israel War : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్దవాతావరణం నెలకొంది... దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీతో పరిస్థితి మరింత దిగజారింది... ఇరాన్ పై దాడులు పెరిగాయి. చివరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని కూడా హతమార్చాయి అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు. దీంతో ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నాడని స్పష్టం అర్థమవుతోంది. చాలాకాలంగా అమెరికాకు కొరకరాని కొయ్యగా ఉన్న ఇరాన్ ను తన దారిలోకి తెచ్చుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు.
ఇరాన్ పై జరుగుతున్న దాడులను ముస్లిం సామాజికవర్గం ఖండిస్తోంది... కానీ ఇస్లామిక్ దేశాలు మాత్రం తటస్థ వైఖరి అవలంభిస్తున్నాయి. అమెరికా లాంటి బలమైన దేశంతో... నియంతలా వ్యవహరిస్తున్న ట్రంప్ లాంటి వ్యక్తితో పెట్టుకోవడం ఎందుకని ప్రపంచ దేశాలు కూడా మౌనంగా ఉండిపోయాయి. కానీ భారత్ మాత్రం ఇరాన్ కు సపోర్ట్ గా తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. తాజా నిర్ణయాలతో ఇండియా ట్రంప్ కు షాక్ ఇస్తోంది... ఇంకా చెప్పాలంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది.
ఇరాన్ యుద్దనౌకకు ఇండియా ఆశ్రయం...
ఇరాన్ సైనికశక్తిని నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే సైనిక స్థావరాలే టార్గెట్ గా దాడులు చేస్తోంది. కేవలం ఇరాన్ లోనే కాదు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆ దేశ యుద్దనౌకలపై కూడా దాడులు చేస్తోంది. ఇటీవల ఇండియా-శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్దనౌక ''IRIS Dena' పై అమెరికా సబ్ మెరైన్ దాడిచేసిన విషయం తెలిసిందే. ఇందులో వందకుపైగా ఇరాన్ నావికాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు... చాలామంది ఆచూకీ గళ్లంతయ్యింది.
ఇలా అమెరికా దాడుల నేపథ్యంలో ఇండియా ఇరాన్ కు సపోర్ట్ గా నిలవడం ఆసక్తికరంగా మారింది. యూఎస్ హెచ్చరికలను లెక్కచేయకుండా ఇరాన్ కు చెందిన మరో యుద్దనౌకకు ఇండియా ఆశ్రయం కల్పించింది. కొచ్చి ఓడరేవులో ఇరానియన్ యుద్దనౌక ''ఐఆర్ఐఎస్ లావన్ (IRIS Lavan)'' ఉన్నట్లు... అందులోని ఇరాన్ నావికాదళ సిబ్బంది బస చేసేందుకు కూడా నావల్ బేస్ లో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ అనుమతితోనే ఈ ఇరాన్ యుద్దనౌక కొచ్చి చేరుకుంది... దీన్నిబట్టి భారత విధానమేంటో స్పష్టమవుతోంది. తమ అతిథిని కాపాడుకునే బాధ్యతను భారత్ తీసుకుంది.
Government Sources- "Days before the IRIS Dena incident south of Sri Lanka, India was approached by Iran to take in the Iranian Ship IRIS Lavan, which was also in the region for the International Fleet Review. This request was received on 28 February 2026, indicating that a… pic.twitter.com/ZHVfKXRDJv
— ANI (@ANI) March 6, 2026
ఇరాన్ యుద్దనౌక అందుకే వచ్చిందా..?
ఇటీవల విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో నావికాదళ కార్యక్రమం జరిగింది... ఈ IFR 2026 (ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ) లో అమెరికాతో పాటు ఇరాన్ కూడా పాల్గొంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరాన్ యుద్దనౌక 'IRIS Dena' తిరిగి వెళుతుండగా అమెరికా జలాంతర్గామి దాడికి పాల్పడింది. దీంతో యుద్దనౌక ధ్వంసమై నీటమునిగింది… ఇందులోని ఇరాన్ నావికాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు... కొంతమందిని శ్రీలంక సైన్యం కాపాడింది.
ఈ దాడి తర్వాత భారత్ అప్రమత్తమైంది... తమ అతిథిగా వచ్చిన ఇరాన్ యుద్దనౌకలపై దాడిని సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు మరో ఇరాన్ యుద్దనౌక ''IRIS Lavan' కు కొచ్చి ఓడరేవులో ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ఈనెల 4న కొచ్చి ఓడరేవుకు IRIS లావన్ చేరుకుంది... కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతితోనే ఇండియన్ నేవీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓడలోని 183 మంది సిబ్బందికి కొచ్చి నావల్ బేస్ లో ఏర్పాట్లు చేశారు.
ఇటీవల జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. నౌకలోని సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని భారత్, ఇరాన్కు అధికారికంగా తెలియజేసింది. నౌక తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం కొచ్చి తీరంలో భారీ భద్రత నడుమ ఈ నౌకను ఉంచారు.
ఖమేనీ మరణంపై భారత్ సంతాపం...
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన విషయం తెలిసిందే... ఈయన మృతికి భారత్ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఇటీవల డిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ సంతాప సందేశాన్ని అందించారు. అంతేకాదు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా అమెరికా చర్యలను భాారత్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకించింది.
అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు పెట్రోల్, డీజిల్ కొరతకు దారితీసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుండి చమురు దిగుమతిని కొనసాగించడానికి అమెరికా తాత్కాలికంగా అనుమతించిందనే వార్తలు భారత రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అయితే 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలను తీర్చే విషయంలో భారత్ ఏ దేశం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇలా అమెరికాకు ఇండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

