- Home
- National
- Petrol Price : ఇండియాకూ పాక్, శ్రీలంక పరిస్థితేనా..? పెట్రోల్, డీజిల్ ధరలు అంతలా పెరుగుతాయా..?
Petrol Price : ఇండియాకూ పాక్, శ్రీలంక పరిస్థితేనా..? పెట్రోల్, డీజిల్ ధరలు అంతలా పెరుగుతాయా..?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలను పెంచేశాయి. దీంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఈ ప్రభావం త్వరలో సామాన్యుడిపై పడతుందా..? వీటి ధరలు ఎంత పెరగొచ్చు?

భారతీయుల ఆందోళన...
Petrol Price : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో... మిడిల్ ఈస్ట్ లో యుద్దవాతావరణం ఆసియా దేశాలను అల్లాడిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తున్నాయి… ఇప్పటికే భారత్ తో పాటు చుట్టుపక్కల దేశాలకు ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇండియా మినహా చుట్టుపక్కల దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పాకిస్థాన్, శ్రీలంక ప్రజలపై అయితే ఇంధన భారం భారీగా పెరిగింది... దీంతో భారతీయుల్లో ఆందోళన మొదలయ్యింది.
పాకిస్థాన్, శ్రీలంకలో పెరిగిన ఇంధన ధరలు...
అసలే ఆర్థిక సంక్షోభం, ఆపైన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంతో ముడి చమురు ధరల పెంపు... దీంతో పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. చేసేదేమీలేక ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం మొదలైన కొన్నాళ్లకే పాక్ ఇంధన ధరలు భారీగా పెంచేసింది. దాదాపు 20శాతం వరకు ఈ ధరలు పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ.55 పెరిగి రూ.321.17 లకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 335.86 కు చేరింది. (ధరలు పాకిస్థాని రూపాయల్లో)
ఇక తాజాగా శ్రీలంకలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి... ఇవాళ (మార్చి 10, మంగళవారం) అర్థరాత్రి నుండే ఈ పెరిగిన ధరలు అమలవుతాయని ఆ దేశం ప్రకటించింది. ఈ మేరకు అధికారులు ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీలంకలో ఆక్టేన్ 92 పెట్రోల్ రూ.24 పెంచడంతో లీటర్ రూ.317 కు చేరింది. అలాగే ఆక్టేన్ 95 పెట్రోల్ రూ.25 పెంచగా లీటర్ రూ.365 కు చేరింది. ఇక ఆటో డీజిల్ రూ.22 పెంచడంతో లీటర్ రూ.303, సూపర్ డీజిల్ రూ.24 పెంచడంతో లీటర్ రూ.353 కు చేరింది. కిరోసిన్ పై కూడా రూ.13 పెంచారు... దీంతో లీటర్ రూ.195 కు చేరింది.
భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
చుక్కపక్కల దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఇండియాలో కూడా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరిగినా ప్రజలపై భారం పెంచబోమని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం తీవ్రమైతే లేదా చమురు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగితే డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఆయిల్ కంపెనీల ఒత్తిడితో ప్రభుత్వం ఇంధన ధరలు పెంచే అవకాశాలుంటాయి.
ఇండియాలో పెట్రోల్ లీటర్కు రూ.5 నుంచి రూ.15 వరకు పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డీజిల్ లీటర్కు రూ.4 నుంచి రూ.12 వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలా ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి... ఇది ఆహారం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. మొత్తం మీద ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
ఇండియాలో 85 శాతం ముడిచమురు దిగుమతి...
భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ముడి చమురు ధర పెరిగినప్పుడు, భారత్ దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. దీంతో చమురు కంపెనీలు అధిక ఖర్చులను ఎదుర్కొంటాయి. చివరికి ఈ భారం వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపు రూపంలో పడుతుంది.
భారత్ నియంత్రిత ఇంధన ధరల విధానాన్ని అనుసరిస్తుంది. వినియోగదారులను రక్షించడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తరచుగా ఇంధనంపై పన్నులను సర్దుబాటు చేస్తుంది లేదా చమురు కంపెనీలను తాత్కాలిక నష్టాలను భరించమని కోరుతుంది. ఇది ధరల పెరుగుదలను ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది. అయితే ప్రపంచ ముడి చమురు ధరలు చాలా వారాల పాటు అధికంగా ఉంటే, ఇంధన ధరల పెంపు తప్పనిసరి అవుతుంది.
మిడిల్ ఈస్ట్ లో అలజడికి, ఇంధన ధరల పెంపుకు సంబంధమేంటి..?
మధ్యప్రాచ్యం ప్రపంచ చమురు ఉత్పత్తికి వెన్నెముక లాంటిది. అందుకే అక్కడ చిన్న యుద్ధ వాతావరణం ఏర్పడినా, చమురు సరఫరాలో కొరత వస్తుందనే భయాలు మొదలవుతాయి. ఈ భయమే ముడి చమురు ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది ఇండియా లాంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతుంది.
ప్రపంచంలోని ముడి చమురులో దాదాపు 30 నుంచి 35 శాతం మధ్యప్రాచ్య దేశాలే ఉత్పత్తి చేస్తాయి. ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి ప్రధాన చమురు ఎగుమతి దేశాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అందుకే పశ్చిమాసియాలో ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే చమురు లభ్యతపై ఆందోళనలు మొదలవుతాయి. వ్యాపారులు, దేశాలు కొరత వస్తుందని భయపడటంతో, చమురు ధరలు వేగంగా పెరగడం మొదలవుతుంది.
ప్రపంచ రోజువారీ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న సన్నని సముద్ర మార్గం 'హోర్ముజ్ జలసంధి' గుండానే వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే, లేదా సైనిక చర్యల వల్ల నౌకల రవాణాకు అంతరాయం కలిగితే, ప్రపంచ చమురు సరఫరాలో ఆకస్మిక ఆటంకాలు ఏర్పడతాయి. ఇలాంటి అంతరాయం ఏర్పడుతుందనే భయంతోనే, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్లు పెరిగి, కొన్ని గంటల్లోనే చమురు ధరలు భారీగా పెరిగిపోతాయి.
యుద్ధాలు, భౌగోళిక-రాజకీయ సంక్షోభాల సమయంలో చమురు వ్యాపారులు కొరతను ఊహిస్తారు. పెట్టుబడిదారులు సరుకును దక్కించుకోవడానికి పోటీపడతారు. దేశాలు అత్యవసర నిల్వలను పెంచుకుంటాయి. దీనివల్ల ఉత్పత్తి నిరంతరాయంగా ఉన్నప్పటికీ, డిమాండ్ అకస్మాత్తుగా పెరిగి ముడి చమురు ధరలు పెరుగుతాయి. వాస్తవ కొరత కంటే భయంతో నడిచే ఈ అదనపు వ్యయాన్ని 'రిస్క్-బేస్డ్ ప్రైసింగ్' అంటారు.
సామాన్యులకు ఇంధర ధరల పెంపు ప్రభావం..
ఇంధన ధరల పెరుగుదల రోజువారీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. బస్సు, ట్యాక్సీ, ఆటో ఛార్జీలు పెరుగుతాయి. కూరగాయలు, కిరాణా సామాన్ల ధరలు పెరుగుతాయి. కొరియర్, డెలివరీ ఛార్జీలు పెరుగుతాయి. నిర్మాణం, గృహ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఫలితంగా, ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగి, అన్ని ఆదాయ వర్గాల కుటుంబ బడ్జెట్లను దెబ్బతీస్తాయి. రాబోయే రోజుల్లో ఏం జరగవచ్చంటే.. యుద్ధం కొనసాగితే లేదా తీవ్రమైతే, భారత్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. దౌత్యపరమైన ప్రయత్నాలు ఫలించి ఉద్రిక్తతలు తగ్గితే, ధరలు కొంతకాలం స్థిరంగా ఉండవచ్చు.

