Crime News: రూ. 2 కోట్ల దొంగను పట్టించిన పావ్ భాజీ.. అసలేం జరిగిందంటే.?
ఎంతటి నేరస్థుడైనా సరే చిన్న తప్పుతో దొరికిపోతుంటాడు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఓ ఉదంతమే వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.

కర్ణాటకలో ఆసక్తికర సంఘటన
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఆశ్చర్యపరిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. రూ. 2.15 కోట్ల విలువైన దొంగతనం చేసిన ఓ వ్యక్తి ఒక చిన్న పావ్ భాజీ తినడం వల్ల పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన జులై 11న జరిగినప్పటికీ, ఇటీవల పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. దొంగ దొరకడానికి, పావ్ భాజీకి సంబంధం ఏంటనేగా మీ సందేహం.
బంగారు దుకాణంలో దోపిడీ
కలబురిగిలోని మారాతుల్లా మాలిక్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న బంగారు దుకాణాన్ని నలుగురు వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు. మాస్కులు ధరించి వచ్చిన ముగ్గురు నిందితులు దుకాణంలోకి చొరబడగా, ప్రధాన సూత్రధారి ఫరూక్ అహ్మద్ మాలిక్ బయట గమనిస్తూ ఉన్నాడు. యజమాని చేతులు, కాళ్లు కట్టి తుపాకీతో బెదిరించి లాకర్ తెరిపించి బంగారం, నగదుతో పరారయ్యారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 2.15 కోట్లు ఉంటుందని అంచనా.
యూపీఐ పేమెంట్తో దొరికిపోయాడు
దొంగతనం చేసిన తర్వాత నిందితులు దుకాణం నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత నిందితుల్లో ఒకరైన ఫరూక్ అహ్మద్ పావ్ భాజీ తినాలనపించింది. దీంతో మళ్లీ వెనక్కి వెళ్లి పావ్భాజీ తిన్నాడు. ఫోన్పే ద్వారా రూ.30 చెల్లించాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టడంతో పోలీసులు సదరు ఫోన్పే ట్రాన్సాక్షన్ ఆధారంగా ఆ నెంబర్ను ట్రేస్ చేశారు. దీంతో ఫరూక్ దొరికిపోయాడు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజం
పోలీసులు ఫరూక్ను అదుపులోకి తీసుకొని విచారించగా, దాదాపు 3 కిలోల బంగారం, కొంత నగదును దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఫిర్యాదు సమయంలో దుకాణ యజమాని మారాతుల్లా కేవలం 805 గ్రాముల బంగారం మాత్రమే పోయిందని చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. దీనిపై పోలీసులు యజమానిని కూడా ప్రశ్నిస్తున్నారు.
నష్టం నుంచి బయటపడేందుకే
ఇదిలా ఉంటే ఫరూక్ అహ్మద్ కూడా బంగారం దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా అతనికి వ్యాపారంలో రూ. 40 లక్షల నష్టం వచ్చింది. దీంతో నష్టం నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే కొంతమందితో కలిసి ఈ దోపీడికి పన్నాగం పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. దోపీడి జరిగిన వెంటనే కొంత బంగారాన్ని కరిగించినట్లు సమాచారం. నిందితుడి నుంచి 2.865 కేజీల బంగారు ఆభరణాలు, రూ.4.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.