- Home
- Business
- Credit Card: ఫోన్పే, ఎస్బీఐ కలిసి మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డులు.. వామ్మో ఎన్ని లాభాలో
Credit Card: ఫోన్పే, ఎస్బీఐ కలిసి మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డులు.. వామ్మో ఎన్ని లాభాలో
ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థ ఫోన్పే మరో ముందడుగు వేసింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐతో కలిసి కొత్త క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు కొత్త కార్డులు
ప్రధాన క్రెడిట్ కార్డు సంస్థ ఎస్బీఐ కార్డ్, ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే కలిసి వినియోగదారుల కోసం రెండు కొత్త కో-బ్రాండ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టాయి. ఇవి ఫోన్పే – ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్, ఫోన్పే – ఎస్బీఐ పర్పుల్ పేర్లతో ఈ రెండు కార్డులను తీసుకొచ్చారు. ఈ రెండు కూడా వీసా, రూపే నెట్వర్క్లపై పనిచేస్తాయి. ఇందులో బ్లాక్ ప్రీమియం కేటగిరీకి చెందినదైతే, పర్పుల్ సాధారణ వినియోగదారుల కోసం రూపొందించారు.
సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకతలు
ప్రారంభ ఫీజు రూ. 1499 చెల్లించాల్సి ఉంటుంది. తొలి బిల్లింగ్ తర్వాత రూ.1500 విలువైన ఫోన్పే గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. ఇక రెండో ఏడాది నుంచి రూ. 1499 రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాదిలో రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తే మాఫీ అవుతుంది.
ఫోన్పే యాప్లో రీఛార్జ్లు, బిల్ పేమెంట్లు, ఇన్సూరెన్స్ చెల్లింపులపై 10% వరకు రివార్డ్ పాయింట్లు పొందొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, ఉబర్, మింత్రా, బుక్మైషో వంటి ప్లాట్ఫాంలలో ఆన్లైన్ కొనుగోళ్లపై 5% రివార్డులు పొందొచ్చు.
స్కాన్ అండ్ పే, ట్యాప్ అండ్ పే ద్వారా చెల్లింపులపై 1% రివార్డులు లభిస్తాయి. ఏడాదిలో రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేసిన వారికి రూ.5 వేల విలువైన ట్రావెల్ వోచర్. దేశీయ విమానాశ్రయాల్లో ప్రతి త్రైమాసికం 4 లాంజ్ యాక్సెస్లు ఉచితంగా పొందొచ్చు. అలాగే అంతర్జాతీయ లాంజ్ల కోసం రూ.8 వేల విలువైన ప్రయారిటీ పాస్ ఉచితంగా లభిస్తుంది.
పర్పుల్ క్రెడిట్ కార్డ్ ముఖ్యాంశాలు
* ప్రారంభ ఫీజు: రూ.499. మొదటి బిల్లు పేమెంట్పై రూ.500 విలువైన ఫోన్పే గిఫ్ట్ వోచర్ అందుతుంది.
* రెన్యువల్ ఫీజు: రెండో ఏడాది నుంచి రూ.499. ఏడాదిలో రూ.1 లక్షకు పైగా ఖర్చు చేస్తే మాఫీ అవుతుంది.
* ఫోన్పే యాప్లో రీఛార్జ్లు, బిల్ పేమెంట్లపై 3% రివార్డులు పొందొచ్చు.
* అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఉబర్, బుక్మైషో వంటి ఆన్లైన్ ప్లాట్ఫాంలలో కొనుగోళ్లపై 2% రివార్డులు.
* స్కాన్ అండ్ పే, ట్యాప్ అండ్ పే చెల్లింపులపై 1% రివార్డులు.
* ఏడాదిలో రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తే రూ.3 వేల విలువైన ట్రావెల్ వోచర్ లభిస్తుంది.
రివార్డు పాయింట్ల ఎలా ఉపయోగించుకోవాలి.?
ఈ రెండు క్రెడిట్ కార్డుల్లో పొందే రివార్డు పాయింట్ల విలువ ఒక్కో రూపాయికి సమానం. వినియోగదారులు ఈ పాయింట్లను ఎస్బీఐ రివార్డ్స్ పోర్టల్ ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు. బిల్ పేమెంట్లు, షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్ వంటి విభాగాల్లో ఈ పాయింట్లను వినియోగించుకోవచ్చు.
వినియోగదారులకు లభించే అధిక ప్రయోజనాలు
ప్రీమియంతో పాటు సాధారణ కేటగిరీలలోని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు వేర్వేరు ఆప్షన్లు పొందుతారు. అధిక ఖర్చులు చేసే వారికి ఫీజు మాఫీతో పాటు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ప్రముఖ ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్ ప్లాట్ఫాంలలో అధిక రివార్డులు పొందొచ్చు. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ల సౌకర్యం లభిస్తుంది.