- Home
- National
- Mock Drill: యుద్ధానికి సంసిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ ఎక్కడ జరగనుందంటే..
Mock Drill: యుద్ధానికి సంసిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ ఎక్కడ జరగనుందంటే..
భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జాతీయ స్థాయిలో భద్రతాపరమైన చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంశాఖ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Mock drill
ఈ మేరకు మే 7న (బుధవారం) దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు తగిన శిక్షణ ఇచ్చి, విపత్తుల సమయంలో స్పందించే తీరుపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్స్ ముఖ్య ఉద్దేశం.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్, ఎన్డీఎంఏ అధికారులు పాల్గొన్నారు. అనంతరం గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, డ్రిల్ అమలులో అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలు ఇచ్చారు.
ఈ డ్రిల్ను 244 జిల్లాల్లో నిర్వహించనున్నారు. దేశంలోని కీలక ప్రాంతాలను మూడు వర్గాలుగా విభజించారు.
కేటగిరీ-1: ఢిల్లీ, ముంబై, చెన్నై, కల్పక్కం, నరోరా, తారాపూర్, కక్రాపూర్, కోట, రావత్భటా, తాల్చేర్ వంటి అణు విద్యుత్ కేంద్రాలున్న నగరాలు.
కేటగిరీ-2: హైదరాబాద్, విశాఖపట్నం వంటి 201 జిల్లాలు, ఎయిర్పోర్టులు, కీలక మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలు.
కేటగిరీ-3: 45 ఇతర జిల్లాలు, ప్రధానంగా సివిల్ డిఫెన్స్ కు అవసరమైన వ్యూహాత్మక ప్రదేశాలు.
హోంశాఖ సమీక్షలో ప్రధానంగా ప్రజలకు రక్షణ, సురక్షితంగా ఉండే విధానాలపై అవగాహన కల్పించే అంశాలను ప్రాధాన్యంగా చర్చించారు. విమానదాడుల హెచ్చరికలు వచ్చినప్పుడు తక్షణంగా ఎలా స్పందించాలి, బ్లాక్ అవుట్ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్సకు అవసరమైన సరఫరాలు వంటి అంశాలపై ప్రజలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ప్రధానితో అజిత్ దోవల్ చర్చలు:
ఇప్పటికే భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులు, పాకిస్తాన్ వైఖరి, కేంద్రం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈ భేటీలో సమీక్ష జరిగినట్లు సమాచారం.
ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం, సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రజల రక్షణకు సంబంధించి ముందస్తు చర్యలతో సిద్ధమవుతుండగా, మాక్ డ్రిల్స్ ద్వారా సామాన్యులకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో స్పష్టమైన దిశానిర్దేశం అందించనున్నాయి.