- Home
- Districts News
- Hyderabad
- TGSRTC: రూ. 10 ఎక్కువ తీసుకున్నందుకు రూ. 10 వేల ఫైన్.. తెలంగాణ ఆర్టీసీకి ఆదేశాలు
TGSRTC: రూ. 10 ఎక్కువ తీసుకున్నందుకు రూ. 10 వేల ఫైన్.. తెలంగాణ ఆర్టీసీకి ఆదేశాలు
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఇటీవల టీఎస్ఆర్టీసీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ప్రయాణికుడికి నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రూ. 10 ఎక్కువ వసూలు చేసినందుకు గాను రూ. 10 వేలు జరిమానా చెల్లించాలని తెలంగాణ ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఒకే దూరం ప్రయాణానికి రెండు బస్సుల్లో వేర్వేరు చార్జీలు వసూలు చేయడాన్ని "సేవ లోపం"గా పరిగణించిన కమిషన్ ఫైన్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేసు సరూర్ నగర్కు చెందిన నింగ్ష్ ఉషప్ప అనే న్యాయవాది దాఖలు చేశారు. ఆయన 2023 జూలై 15న హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి సూర్యాపేట వరకు ఓ ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించగా సూర్యాపేట డిపోకు చెందిన ఆ బస్సులో రూ.180 చెల్లించారు. అయితే తిరిగి వచ్చినపుడు ఖమ్మం డిపోకు చెందిన మరో బస్సులో అదే దూరానికి రూ.190 వసూలు చేశారు.
TGSRTC
ఈ రకంగా అదనంగా వసూలు చేయడంపై ఉషప్ప కండక్టర్ను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. దీంతో ఆర్టీసీపై న్యాయదిశగా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
తమ వాదనలో టీఎస్ఆర్టీసీ అధికారులు ఓ టికెట్ జారీ సమయంలో పొరపాటు జరిగిందని చెప్పారు. ఖమ్మం డిపోకు చెందిన బస్సులో ఉషప్ప ఎల్బీనగర్ వరకు మాత్రమే ప్రయాణించగా, టికెట్ను ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) వరకు వెళ్లే ప్రయాణికుడిగా జారీ చేశారని తెలిపారు.
TS RTC BUS
ఈ పొరపాటు వల్లే అదనంగా రూ.10 చార్జ్ అయ్యిందని వివరించారు. ఉషప్ప తన వద్ద ఉన్న టికెట్ను ఆధారంగా చూపుతూ తాను తప్పుగా చార్జ్ అయ్యానని న్యాయంగా వాదించారు. ఈ టికెట్లో తాను వెళ్లాల్సిన ప్రాంతం తప్పుగా ముద్రించబడిందని స్పష్టంగా కనిపించింది. విషయం పరిశీలించిన కమిషన్ అధ్యక్షురాలు చిట్నేని లతాకుమారి, సభ్యులు పరుపల్లి జవహర్ బాబు, జె. శ్యామలలు పాల్గొన్న బృందం, ఇది ఆర్టీసీ వైఫల్యం అని స్పష్టం చేసింది.
Bus ticket
తదనంతరం టీఎస్ఆర్టీసీ ప్రయాణికుడికి అదనంగా వసూలు చేసిన రూ.10 రిఫండ్ చేయాలని, దీనితో పాటు నష్టం నిమిత్తం రూ.5,000 పరిహారం, రూ.5,000 న్యాయ వ్యయాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోపు చెల్లించాలని సూచించింది.
bus conductor
ఈ తీర్పు వినియోగదారుల హక్కులను రక్షించే దిశగా తీసుకున్న ఒక ప్రాధాన్యతగల చర్యగా చెప్పొచ్చు. చిన్న అంశం అయినా, ఆర్టీసీ వంటి ప్రభుత్వ సంస్థలు తప్పులు జరిగితే బాధ్యత వహించాలన్న సందేశాన్ని ఈ తీర్పు ఇస్తోంది.