- Home
- National
- Dharmasthala: ధర్మస్థల కథ కట్టు కథేనా.? వందలాది మహిళల శవాల వెనక అసలు నిజం ఏంటి? 20 ఏళ్ల రహస్య ఏం చెబుతోంది.? ఏషియా నెట్ ఎక్స్క్లూజివ్
Dharmasthala: ధర్మస్థల కథ కట్టు కథేనా.? వందలాది మహిళల శవాల వెనక అసలు నిజం ఏంటి? 20 ఏళ్ల రహస్య ఏం చెబుతోంది.? ఏషియా నెట్ ఎక్స్క్లూజివ్
ధర్మస్థల.. ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ నడుస్తోంది. పవిత్ర ఆలయ పరిసరాల్లో వందలాది మహిళల శవాలను పూడ్చి పెట్టానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యావత్ దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది.

ధర్మస్థల ఎక్కడుంది.?
ధర్మస్థల.. కర్ణాటక పశ్చిమ కనుమల మధ్యలో ఉన్న పవిత్ర ఆలయ ప్రాంతం. మంజునాథేశ్వర స్వామి ఆలయం గల ఈ తీర్థయాత్రా కేంద్రానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది. కానీ తాజాగా ఓ సంచలన ఆరోపణ ఈ ప్రాంతాన్ని తీవ్ర కలకలానికి గురిచేసింది. ఇక్కడ వందలాది హత్యలు జరిగాయన్న ఆరోపణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదుతో వెలుగులోకి
1995 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో శానిటేషన్ ఉద్యోగిగా పనిచేసిన ఓ వ్యక్తి, జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. తన సర్వీసు కాలంలో దాదాపు 100-300 మృతదేహాలను ఖననం చేశానని తెలిపాడు.
వీటిలో ఎంతో మంది మైనర్ బాలికలు, యువతులు ఉండేవారని, వారిపై లైంగిక దాడులు, యాసిడ్ దాడులు జరిగాయని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ శవాలను నేత్రావతి నది ఒడ్డున, ఆలయం పక్కనున్న అడవుల్లో పాతిపెట్టినట్లు, కొన్ని సందర్భాల్లో నదిలో విసిరేశానని వివరించాడు. తన వాదనకు బలంగా కొన్ని ఫోటోలు, ఆధారాల్ని కూడా పోలీసులకు సమర్పించాడు.
హత్యలకు ఎవరు కారణం.?
పారిశుధ్య కార్మికుడు చేస్తున్న ఆరోపణల ప్రకారం ఈ హత్యల వెనుక ఆలయానికి చెందిన పలువురు అధికారికులు ఉన్నారని చెబుతున్నారు. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని, ఒకసారి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా తీవ్రంగా దాడికి గురయ్యానని తెలిపాడు. తన కుటుంబంలోని ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన తర్వాత మానసికంగా తట్టుకోలేక ధర్మస్థల వదిలి వెళ్లిపోయానని వివరించాడు. కానీ దశాబ్దం తర్వాత, మనసులో ఉన్న అపరాధభావంతో తిరిగి వచ్చి వాస్తవాలు బయటపెట్టినట్లు చెప్పాడు. అతని వాంగ్మూలం పోలీసులను కూడా ఉలిక్కిపడేలా చేసింది.
ఇందులో ఎంత వరకు నిజం ఉంది.?
అయితే పారిశుధ్యకార్మికుడు చేసిన ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 300 మంది మృతదేహాలు ఖననం చేశానని అంటున్న వేళ, ఇన్ని మిస్సింగ్ కేసులు ఏవీ బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
అయితే కొన్ని ఘటనలు మాత్రం ఇది నిజమనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా 2012లో సౌజన్య అనే విద్యార్థిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అలాగే అనన్య భట్ అనే మెడికల్ విద్యార్థిని మిస్సింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అనన్య భట్ తల్లి కోర్టును ఆశ్రయించి తన కూతురు అస్తికలు ఇప్పించాలని కోరింది. దీంతో కార్మికుడు చెప్పింది నిజమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
సిట్ ఏర్పాటు
పారిశుధ్య కార్మికుడు ఆరోపణలకు స్పందించిన కర్ణాటక ప్రభుత్వం జులై 19న SIT (Special Investigation Team) ఏర్పాటు చేసింది. ప్రణవ్ మోహంతి నేతృత్వంలోని ఈ బృందం నది పరిసరాల్లో తవ్వకాలు, ఆలయ ప్రాంగణాల్లో ఆధారాల సేకరణ మొదలుపెట్టింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల గౌడ్ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తోంది. కార్మికుడికి పటిష్ట భద్రత కల్పించాలని అంటున్నారు.
ఆలయ పవిత్ర దెబ్బ తియడానికే అంటూ..
ఇదిలా ఉంటే ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి అన్నారు. ధర్మస్థల ఒక పవిత్ర పుణ్యక్షేత్రమని, దాన్ని అపహాస్యం చేయడానికే ఇలాంటి కథనాలు పుట్టించారని ఆరోపించారు. ఇక్కడ ఆధ్యాత్మికత, సమానత్వాన్ని పెంపొందిస్తున్నారని, అలాంటి ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక కుట్ర ఉందన్నారు.
ఎన్నో ప్రశ్నలు
ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఏవో ఆరోపణాలు చేసినంత మాత్రాన ఎలా నమ్ముతారంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 300 మంది మరణిస్తే 20 ఏళ్లపాటు ఆ విషయంలో వెలుగులోకి రాకుండా ఎలా ఉంటుంది.? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఈ మిస్టరీ వెనకాల ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే విచారణలో మాత్రమే తేలాలి.