Birth and Death Registration Bill: జనన, మరణాల నమోదుకు సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చే జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు–2026కు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఆమోదంతో తదుపరి చట్టంగా అమల్లోకి వచ్చే దశకు చేరుకుంది.

సభలో ఆందోళనల మధ్య బిల్లు ఆమోదం

రాజ్యసభ సమావేశాల సందర్భంగా అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణలు, నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశాలపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నినాదాల కారణంగా సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం మధ్యాహ్నం సమావేశాలు తిరిగి ప్రారంభమైన తర్వాత జనన, మరణ నమోదు (సవరణ) బిల్లును సభ పరిశీలించి ఆమోదించింది.

ఆలస్యంగా నమోదు చేస్తే కొత్త నిబంధనలు అమలు

1969లో అమల్లోకి వచ్చిన జనన, మరణ నమోదు చట్టంలో ఈ సవరణల ద్వారా ఆలస్యంగా నమోదయ్యే కేసులపై మరింత కఠిన విధానం అమలు చేయనున్నారు. అయితే జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోగా నమోదు చేస్తే ఇప్పటిలాగే ఎలాంటి ఫీజు లేకుండా నమోదు చేసే అవకాశం ఉంటుంది. 21 రోజుల తర్వాత నుంచి ఒక సంవత్సరం లోపు నమోదు చేయాలంటే నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త బిల్లు ప్రకారం ఒక సంవత్సరం దాటి రెండు సంవత్సరాల లోపు నమోదు చేయాలంటే జిల్లా మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) లేదా వారు అధికారపూర్వకంగా నియమించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి. సంబంధిత అధికారులు సమర్పించిన పత్రాలు, వివరాలను పరిశీలించిన తర్వాత మాత్రమే నమోదు చేసేందుకు అనుమతి ఇస్తారు.

అలాగే రెండు సంవత్సరాలకుపైగా ఆలస్యమైతే ఇకపై కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) ఆదేశాల ఆధారంగానే నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సమర్పించిన సమాచారం నిజమైనదేనని ధృవీకరించిన తర్వాత మాత్రమే నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.

సవరణల వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఇదే

ప్రతి శిశువు జననం సకాలంలో నమోదు కావడం వల్ల విద్య, గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర చట్టపరమైన హక్కులు పొందడం సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అదే విధంగా మరణాల నమోదు కూడా పరిపాలనా, న్యాయపరమైన అవసరాలకు కీలకమని పేర్కొంది. నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీని అరికట్టడం, ఓటరు జాబితాల్లో అక్రమ నమోదును తగ్గించడం, ప్రజలు నిర్ణీత సమయంలోనే నమోదు చేసేలా ప్రోత్సహించడం ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇదిలా ఉండగా, పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై విపక్షాలు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయోధ్య ఘటన, నీట్ లీక్ వ్యవహారాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేసి చర్చకు రావాలని డిమాండ్ చేశాయి.