8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్డేట్ !
8th Pay Commission: 8వ వేతన సంఘంపై అంచనాలు పెరుగుతున్నాయి. పెరగనున్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్, వేతనాలు ప్రభుత్వ ఖజానాపై భారంగా మారనున్నాయనే హెచ్చరికలు కూడా ఉన్నాయి. మరి మోదీ సర్కారు ఆలోచన ఏంటి?

ఉద్యోగులకు భారీ జీతాలు.. ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే 8వ వేతన సంఘం. జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతోంది? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు భారీ జీతాల పెంపు కోసం డిమాండ్ చేస్తుంటే, మరోవైపు ఇది ప్రభుత్వ ఖజానాకు పెద్ద సవాల్గా మారేలా కనిపిస్తోంది. అసలు ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గొడవేంటి? ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో మీకు తెలుసా?
ఏమిటీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్? జీతాలపై దీని ప్రభావం ఎంత?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీని నిర్ణయించే కీలకమైన అంశమే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఇది ఒక మల్టిప్లయర్ లాంటిది. ఈ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఉద్యోగుల జీతాలు అంత భారీగా పెరుగుతాయి. అయితే, ఇది ఎంత పెరిగితే ప్రభుత్వంపై వేతనాలు, పెన్షన్ల భారం అంతగా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే.. ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అయితే, ప్రభుత్వానికి మాత్రం ఖజానా ఖాళీ అయ్యే టెన్షన్.
నిపుణులు ఏమంటున్నారు? ఎన్పీఎస్ ఫెడరేషన్ హెచ్చరికలు
ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు, పెన్షన్ నిపుణుడు మంజీత్ సింగ్ పటేల్ అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వం ముందు కేవలం జీతాలు పెంచడమే కాదు, పెన్షన్ల భారాన్ని మోయడం కూడా పెద్ద టాస్క్. ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో కేవలం 2 శాతం పెరుగుదల ఉన్నా, అది ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. ప్రస్తుతం దాదాపు 32 నుండి 33 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఉన్నారు. వీరు తమ బేసిక్, డీఏలో 10 శాతం కంట్రిబ్యూట్ చేస్తే, ప్రభుత్వం 14 శాతం ఇస్తోంది. దీనివల్ల నెలకు సుమారు రూ. 3,000 కోట్లు ఎన్పీఎస్ ఖాతాల్లో జమ చేయాల్సి వస్తోంది.
యూపీఎస్ తో పెరగనున్న అదనపు భారం
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వస్తే, ప్రభుత్వ సహకారం 14 శాతం నుండి ఏకంగా 18.5 శాతానికి పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ. 40,000 ఉంటే, ప్రభుత్వం ప్రతి ఉద్యోగిపై అదనంగా రూ. 6,660 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే వేతనాల పెంపుతో పాటు, పెన్షన్ ఖర్చులు కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతాయని అర్థం.
మెమోరాండం గడువు పెంపు.. రైల్వే ఉద్యోగుల భారీ డిమాండ్
8వ వేతన సంఘానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే.. వివిధ వర్గాల నుండి సూచనలు, మెమోరాండంలు స్వీకరించే గడువును జూన్ 15 వరకు పొడిగించారు. అంతకుముందు ఇది ఏప్రిల్ 30, ఆ తర్వాత మే 31 వరకు ఉండేది. కాగా, ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ (IRTSA) మాత్రం ఒక భారీ డిమాండ్ పెట్టింది. కనీస బేసిక్ జీతాన్ని రూ. 52,600 కి పెంచాలని కోరుతున్నారు. రైల్వే టెక్నికల్ స్టాఫ్ బాధ్యతలు పెరుగుతున్నందున, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులను బట్టి జీతాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
7వ వేతన సంఘం వర్సెస్ 8వ వేతన సంఘం
గతంలో 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఆధారంగా చేసుకుని కనీస వేతనాన్ని రూ. 18,000 గా నిర్ణయించారు. ఇప్పుడు 8వ వేతన సంఘం ఇచ్చే సిఫార్సులపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో చిన్న మార్పు జరిగినా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల ఆదాయం మారిపోతుంది. కానీ, అదే సమయంలో ప్రభుత్వ ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది కాబట్టి, మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

