Potatoes: డయాబెటిస్ ఉంటే బంగాళదుంపలు ఎందుకు తినకూడదు?
Potatoes: డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంపలు తినాలంటేనే భయపడతారు. డయాబెటిస్ కి బంగాళదుంపలకు మధ్య సంబంధం చాలా మందికి తెలియదు. ఇక్కడ మేము బంగాళదుంపలు తింటే డయాబెటిస్ రోగులకు ఏం జరుగుతుందో వివరించాము.

బంగాళాదుంపలతో డయాబెటిస్
పేదవాడి ఆహారంగా బంగాళదుంపలకు పేరుంది. తక్కువ రేటుకే కిలో బంగాళదుంపలు వచ్చేస్తాయి. అయితే డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు మాత్రం బంగాళదుంపలు తినకూడదని చెబుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను ఎందుకు తినకూడదు? అన్నవిషయంపై చాలామందికి అవగాహన లేదు. మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం వల్ల వచ్చే ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాంటి వాటిలో బంగాళాదుంపలు కూడా ఒకటి.
గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు మధుమేహులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగేస్తాయి. అలా పెరిగితే శరీరంలోని అనేక అవయవాలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. అలాంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాల్లో బంగాళాదుంపలు కూడా ముఖ్యమైనది. వీటిని తిన్న తర్వాత మధుమేహ రోగులకు ఇబ్బందులు రావచ్చు. దానికి కారణం ఇందులో ఉండే పిండి పదార్థాలు. అలాగే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. మధుమేహం ఉన్నవారు గ్లైసిమెంట్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలు మాత్రమే ఎంపిక చేసుకొని తినాల్సిన అవసరం ఉంటుంది.
ఎలా తిన్నా ప్రమాదమే
బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్ల శాతం అధికంగా ఉంటుంది. అందుకే వీటితో చేసిన ఆహారాలు తినగానే అవి శరీరంలో చేరి గ్లూకోజ్ గా త్వరగా మారిపోతాయి. ఆ గ్లూకోజ్ రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. ఇక మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ కూడా సరిగా పనిచేయదు. ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం, చక్కెరను సరైన పద్ధతిలో వినియోగించలేకపోవడం వంటివి జరుగుతుంది. దీనివల్ల రక్తంలో హై షుగర్ సమస్య ఏర్పడుతుంది. బంగాళదుంపలను ఎలా తిన్నా ప్రమాదమే. ఉడికించిన బంగాళదుంపలను తింటే అవి త్వరగా జీర్ణమై చక్కెరను త్వరగా విడుదల చేస్తాయి. అదే ఫ్రై చేసిన బంగాళదుంపలు తింటే ఇంకా హానికరం. అవి నూనెతో పాటు కలిసి కార్బోహైడ్రేట్లను శరీరంలో విడుదల చేసి బరువును పెంచేస్తాయి. కొలెస్ట్రాల్ సమస్యను కూడా పెరిగేలా చేస్తాయి.
బంగాళాదుంపలకు బదులు వీటిని...
బంగాళదుంపల్లో పూర్తిగా పోషకాలు లేవని మాత్రం అనుకోవద్దు. దీనిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు ఈ పోషకాల కోసం బంగాళదుంపలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వీటికి బదులు సొరకాయ, దోసకాయ, బెండకాయ, పాలకూర, క్యాబేజీ వంటివి తింటే ఈ పోషకాలు అన్నీ శరీరానికి అందుతాయి. ఈ కూరగాయలకు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు. ఒకవేళ మీకు బంగాళదుంపలు తినాలనుకుంటే చాలా తక్కువ మోతాదులో తినాలి. అది కూడా తొక్కతో కలిపే వండుకొని తినాలి. ఎందుకంటే తొక్కలో ఫైబర్ ఉంటుంది. అలాగే బంగాళదుంపలతో పాటు ఇతర కూరగాయలను కూడా కలిపి వండుకొని తింటే మంచిది. అప్పుడు ఈ దుంపల శాతం తగ్గుతుంది. అంతే తప్ప బంగాళదుంపలు ఒక్కటే కూరగా వండుకొని తినడం మంచిది కాదు.
మొత్తంగా మధుమేహం ఉన్నవారు బంగాళదుంపలు తినడం వల్ల వచ్చే లాభం ఏదీ లేదు.. అన్ని నష్టాలే. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం బరువు పెరిగిపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతాయి. కాబట్టి వీలైనంతగా బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది. మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో భాగంగా ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలను తినాలి. ఆహారంపై ఎంత నియంత్రణంగా ఉంటే మధుమేహాన్ని అంతగా అదుపులో ఉంచుకోవచ్చు.

