- Home
- International
- USA: అమెరికాలో వెలుగులోకి మరో స్కామ్.. భారతీయ విద్యార్థుల్లో ఆందోళన, అసలేం జరుగుతోంది.?
USA: అమెరికాలో వెలుగులోకి మరో స్కామ్.. భారతీయ విద్యార్థుల్లో ఆందోళన, అసలేం జరుగుతోంది.?
USA: అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు కీలకంగా భావించే OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)ప్రోగ్రామ్ చుట్టూ వివాదం నెలకొంది. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) తాజాగా చేసిన ప్రకటన పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.

ఇంతకీ OPT అంటే ఏమిటి?
అమెరికాలో F-1 స్టూడెంట్ వీసాతో చదువుతున్న విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక పని అనుభవం కల్పించే విధానమే OPT. సాధారణంగా ఇది 12 నెలలపాటు ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు పూర్తి చేసిన వారికి అదనంగా 24 నెలల పొడిగింపు లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు అమెరికన్ కంపెనీల్లో పనిచేసి అనుభవం సంపాదిస్తారు. చాలామంది తరువాత H-1B ఉద్యోగ వీసాకు మారే అవకాశాన్ని కూడా పొందుతున్నారు. అందుకే అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు OPT చాలా కీలకం.

అమెరికా అధికారుల ఆరోపణలు ఏంటి?
ICE అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయని చెబుతున్నారు. కొందరు విద్యార్థులు వాస్తవానికి పనిచేయకపోయినా ఉద్యోగం చేస్తున్నట్లు చూపించినట్లు గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తులో లేని కంపెనీల్లో ఉద్యోగాలు చూపించడం, మూసివేసిన కార్యాలయాలను ఉద్యోగ సంస్థలుగా నమోదు చేయడం, ఒకే చిరునామాలో అనేక కంపెనీలు పనిచేస్తున్నట్లు చూపించడం, విదేశాల్లో నుంచే ఉద్యోగ నిర్వహణ చేస్తున్నట్లు గుర్తించడం, షెల్ కంపెనీల ద్వారా వీసా నిబంధనలు తప్పించుకోవడం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ICE యాక్టింగ్ డైరెక్టర్ టాడ్ లైయోన్స్ ప్రకారం, OPT వ్యవస్థ కొంతమంది చేతుల్లో మోసాలకు మార్గంగా మారిందని తెలిపారు. ICE ప్రకారం, ఇప్పటివరకు పరిశీలించిన టాప్ 25 OPT ఉద్యోగ సంస్థల్లోనే 10 వేల మందికి పైగా విద్యార్థులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు.
జాతీయ భద్రత కోణంలో అమెరికా ఆందోళన
ఈ వ్యవహారాన్ని అమెరికా ప్రభుత్వం కేవలం వీసా ఉల్లంఘనగా మాత్రమే చూడడం లేదు. జాతీయ భద్రతకు ముప్పుగా కూడా పరిగణిస్తోంది. కొన్ని కేసుల్లో ఉద్యోగ మోసాలు, ఆర్థిక నేరాలు, గూఢచర్య ఆరోపణలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రస్తుతం OPT విధానాన్ని పూర్తిగా సమీక్షిస్తోంది. పన్ను నిబంధనలు, ఉద్యోగ ధృవీకరణ, విద్యార్థుల పని విధానం వంటి అంశాలను కఠినంగా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎలా ఉండొచ్చు?
అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా OPTపై ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా దర్యాప్తు భారతీయ విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందినవారిపై అదనపు పరిశీలన ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇకపై ఉద్యోగ సంస్థల ఫిజికల్ వెరిఫికేషన్ ఉండొచ్చు. ఫేక్ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు. OPT దరఖాస్తులపై కఠిన పరిశీలనతో పాటు వీసా రద్దు, డిపోర్టేషన్ వంటి చర్యలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ పాలసీలతో కఠినతరమైన ఇమిగ్రేషన్ వ్యవస్థ
డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో కఠిన మార్పులు కనిపిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల ప్రవేశం, ఉద్యోగ వీసాలు, అంతర్జాతీయ కార్మిక విధానాలపై మరింత కఠిన నిబంధనలు తీసుకొస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలపై సుంకాలు పెంచడం, వీసా ప్రక్రియలను కఠినతరం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు OPT వ్యవస్థపై దర్యాప్తు కూడా అదే దిశగా చూస్తున్నారు. అమెరికాలో చదువుతున్న విద్యార్థులు చట్టబద్ధమైన కంపెనీల్లోనే పనిచేయాలని, అన్ని వీసా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో OPT, H-1B వీసా విధానాల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

